
ఈ నేపథ్యంలో, పాలనలో పారదర్శకత లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి.. అవినీతిని సహించేది లేదంటూ చెక్ పోస్టుల రద్దుకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం నిర్ణయమే ఆధారం! .. వాస్తవానికి, జీఎస్టీ (GST) అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల సరిహద్దుల్లో రవాణా చెక్ పోస్టుల అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. పన్నుల విధానం పూర్తిగా మారడం, ఈ-వే బిల్లుల (E-way Bills) వ్యవస్థ అమలులోకి రావడంతో, ఈ చెక్ పోస్టుల ఉనికి అనవసరంగా మారిపోయింది. అయినప్పటికీ, ఇంతకాలం కొన్ని కారణాల వల్ల రాష్ట్రంలో వాటిని కొనసాగించినట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. నేటి సాయంత్రంలోగా నివేదిక: ఫర్నిచర్ తరలింపు! .. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవాణా శాఖ అధికారులకు గట్టి డెడ్లైన్ విధించారు.
ఈరోజు (బుధవారం) సాయంత్రం ఐదు గంటల్లోగా రవాణా చెక్ పోస్టుల మూసివేతపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాకుండా, మూసివేసిన చెక్ పోస్టులలో ఉన్న ఫర్నీచర్, ఇతర సామాగ్రిని స్థానిక ఆర్టీఏ (RTA) కార్యాలయాలకు తరలించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందిని కూడా వారిని వేరే బాధ్యతలకు కేటాయించాలని ఆదేశించారు. తెలంగాణ ప్రజలపైనా, వ్యాపార వర్గాలపైనా అవినీతి భారం తగ్గించేందుకు, రవాణా ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన దిశగా రేవంత్ రెడ్డి వేసిన మరో కీలక అడుగుగా దీన్ని విశ్లేషిస్తున్నారు.