బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న బీసీ ఐక్య వేదిక ఇప్పుడు పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ధరణాలు, రాస్తారోకోలు, తెలంగాణ బంద్ వంటి కార్యక్రమాలు చేసినా – అధికార వర్గాలు స్పందించకపోవడంతో ఈసారి ఉద్యమం మరింత తీవ్రంగా ఉండబోతోందని స్పష్టం చేశారు. రాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్, ప్రభుత్వ యంత్రాంగం ఎవరూ స్పందించకపోవడంతో, బీసీ నాయకులు “ఇక మౌనం కాదు – మోక్షం వరకు పోరాటం” అనే నినాదంతో ముందుకు వస్తున్నారు.
 

గాంధేయ మార్గంలో, గౌతమ బుద్ధుడి స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని నడిపించబోతున్నారు. ఈసారి ఉద్యమానికి వారు పెట్టిన పేరు కూడా ప్రత్యేకమే -“అష్టాంగ్ ఆందోళనలు”. బీసీ ఐక్య వేదిక నాయకులు వెల్లడించిన ప్రకారం, ఈ అష్టాంగ్ ఆందోళనలు మొత్తం 8 రకాలుగా, మూడు నెలలపాటు రాష్ట్రవ్యాప్తంగా సాగనున్నాయి. వీటిలో ప్రతి దశ కూడా బీసీల హక్కుల సాధనలో ఒక కొత్త అధ్యాయం అవుతుందనటంలో సందేహం లేదు.



ఇవి ఆ 8 ఉద్యమాలు :
1.  మౌన దీక్ష – ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిశ్శబ్ద నిరసన.
2. పల్లె నుంచి పట్నం వరకు బీసీల ధర్మపోరాట దీక్ష – గ్రామీణ స్థాయిలో అవగాహన పెంపు.
3.  రన్ ఫర్ సోషల్ జస్టిస్ – సామాజిక న్యాయం కోసం ప్రజా పరుగు.
4.  ఎంపీలతో ములాఖత్ – రిజర్వేషన్ అంశంపై ఎంపీలను చైతన్యపరచడం.
5.  అఖిలపక్ష నేతల ఇళ్లకు వెళ్లి వివరణ ఇవ్వడం – రాజకీయ పార్టీల మద్దతు కోరడం.
6.  బీసీల చలో ఢిల్లీరాజధాని వేదికగా ఐక్యత ప్రదర్శన.
7.  పార్లమెంటు ముట్టడి – కేంద్రంపై ఒత్తిడి పెంచడం.
8.  పల్లె నుంచి పట్నం వరకు బస్సు యాత్ర – బీసీల హక్కుల జాగృతి యాత్ర.

ఈ ఉద్యమంలో బీసీలతో పాటు ఎస్సీలు, ఎస్టీలను కూడా చేర్చుకుని ఒక సామాజిక న్యాయ వేదికగా మార్చాలని నాయకులు నిర్ణయించారు. మరోవైపు బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య అయితే రాష్ట్రస్థాయిని దాటి దేశస్థాయికి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా 50 శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయించాలన్న లక్ష్యంతో కృష్ణయ్య తానే ముందుండి నడిపే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. “బీసీలకు రిజర్వేషన్ అంటే హక్కు, అది దానం కాదు” అంటూ కృష్ణయ్య స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఈ ‘అష్టాంగ్ ఆందోళనలు’ తెలంగాణ రాజకీయాల్లో కొత్త తుపాను తిప్పడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: