- అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు చెరుకు రైతులు గుర్తుకు రాలేదా?
- యుగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీ ఏమైంది?
- రైతులకు న్యాయం చేయకపోతే పోరాటం తప్పదు
- బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఆగ్రహం
ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడటం ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేష్కు వెన్నతో పెట్టిన విద్య అని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ధ్వజమెత్తారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో చెరుకు రైతులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి, ఇప్పుడు వారిని నట్టేట ముంచారని ఆయన మండిపడ్డారు. చిత్తూరు జిల్లా నిండ్రలోని నేతమ్స్ షుగర్ ఫ్యాక్టరీ, అనకాపల్లి జిల్లా గోవాడ షుగర్ ఫ్యాక్టరీల సమస్యలపై, చెరుకు రైతుల కన్నీటి వేదనపై రామచంద్రయాదవ్ గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
పాదయాత్రలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మరిచారు
"యువగళం పాదయాత్రలో నారా లోకేష్ చెరుకు రైతుల కష్టాలు చూసి చలించిపోయినట్టు నటించారు. తాము అధికారంలోకి రాగానే రైతులను ఆదుకుంటామని, ఫ్యాక్టరీలను తెరిపిస్తామని కల్లబొల్లి హామీలు ఇచ్చారు. ఆ మాటలు నమ్మి ఓట్లేసిన రైతులకు ఇప్పుడు కన్నీళ్లే మిగిలాయి" అని రామచంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రైతుల సంక్షేమం అంటూనే, కళ్లెదుట నష్టపోతున్న చెరుకు రైతులను విస్మరించడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు.
రైతుల బకాయిలు చెల్లించకుండా వేలమా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా?
నేతమ్స్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులకు 13 కోట్లు, రైతులకు 35 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతుంటే, ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. "రైతులకు, కార్మికులకు న్యాయం చేయకుండా, ఒక ఫైనాన్స్ కంపెనీకి మేలు చేసేలా ఆస్తుల వేలానికి ఎలా అనుమతిస్తారు? ఇది ప్రభుత్వాన్ని నడిపిస్తున్న చంద్రబాబు వైఫల్యం కాదా?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
గోవాడ ఫ్యాక్టరీ దోపిడీలో టీడీపీ నాయకుల పాత్ర..?
గోవాడ ఫ్యాక్టరీని గతంలో వైసీపీ నాయకులతో కలిసి టీడీపీ నాయకులు కూడా అడ్డగోలుగా దోచుకున్నారని, ఇప్పుడు అవేమీ పట్టనట్టు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. "ఫ్యాక్టరీ నష్టాలకు కారణమైన మీ పార్టీ నాయకులను వదిలేసి, రైతులను గాలికొదిలేస్తారా? గోవాడ ఫ్యాక్టరీ అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, మీ పార్టీ నాయకులతో సహా దోషులు ఎవరైనా శిక్షించే దమ్ము చంద్రబాబుకు ఉందా?" అని ఆయన సవాల్ విసిరారు.
ముఖ్యమంత్రికి హెచ్చరిక
"ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని మీరు, రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారు? చెరుకు రైతుల ఉసురు తగలక మానదు" అని రామచంద్ర యాదవ్ అన్నారు. బీసీవై పార్టీ చెరుకు రైతుల పక్షాన నిలబడుతుందని, వారి హక్కుల కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే జోక్యం చేసుకుని, రెండు ఫ్యాక్టరీల సమస్యలను పరిష్కరించి, లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రైతులను, కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, రైతులు, కార్మికులతో కలిసి రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తామని బోడె రామచంద్ర యాదవ్ హెచ్చరించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి