చంద్రబాబు, కేసీఆర్.. ఇద్దరూ రాజకీయంగా గురు శిష్యులుగా చెప్పుకోవచ్చు. ఇద్దరూ ఒకే సమయంలో ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేసినా.. ఆ తర్వాత ఎన్టీఆర్‌కు చెక్ చెప్పి చంద్రబాబు ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక కూడా మంత్రి పదవి కొనసాగింది. ఆ తర్వాత 1999లో చంద్రబాబు మరోసారి సీఎం అయ్యాక మాత్రం కేసీఆర్ ను పక్కకు పెట్టారు. మంత్రి పదవి ఇవ్వకుండా నిరాశపరిచారు. జస్ట్ అసెంబ్లీలో డిఫ్యూటీ స్పీకర్ పదవి మాత్రం ఇచ్చి సరిపెట్టారు.


దీంతో చిన్నబోయిన కేసీఆర్.. ప్రత్యామ్నాయం ఆలోచించుకుని కొన్నాళ్ల తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి భుజానికి ఎత్తుకున్నారు.  ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఆనాటి రోజులను కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో సెటైర్‌గా గుర్తు చేసుకున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కరెంటు కష్టాలు తీవ్రంగా ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో కరెంట్ కష్టాలు దాదాపు లేవనే చెప్పాలి. దేశవ్యాప్తంగా కరెంట్ ఉత్పత్తి పెరగడం కూడా ఇందుకు కారణంగా చెప్పొచ్చు. దీనికి తోడు తెలంగాణ సర్కారు అనేక విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుని 24 గంటల విద్యుత్ ఇస్తోంది.


ఈ విషయాన్ని ప్రస్తావించిన కేసీఆర్.. గతంలో సాక్షాత్తూ అసెంబ్లీలోనే కరెంట్ పోయేదని.. ఓసారి రోశయ్య 2 గంటల్లో కరెంట్ వస్తుందని.. లేకపోతే.. అసెంబ్లీలోనే ఉరి వేసుకుంటానని శపథం చేశారట. ఆ సమయంలో కేసీఆర్ సభ్యుడిగా ఉన్నారట. అయితే కరెంట్ రాలేదట. దీంతో అవమానంగా ఫీలయిన రోశయ్య.. తర్వాత అసెంబ్లీకి సూట్ కేసులో ఉరి తాడు తెచ్చుకుని వచ్చారట. అసెంబ్లీలోనే ఉరి వేసుకుంటానన్నారట. దీంతో కేసీఆర్‌తో పాటు ఇతర నాయకులు రోశయ్యను వారించారని.. అప్పట్లో కరెంటు కష్టాలు అలా ఉన్నాయని గుర్తు చేశారు.


అప్పట్లో కాంగ్రెస కరెంట్ ఇవ్వలేకపోయిందని చెప్పిన కేసీఆర్.. ఆ తర్వాత ప్రపంచ మేధావి కూడా కరెంట్ ఇవ్వలేకపోయారని పరోక్షంగా చంద్రబాబుపై సెటైర్ వేశారు. అంటే చంద్రబాబును ప్రపంచ మేధావి అంటూ కేసీఆర్ వ్యంగ్యంగా అన్నారన్నమాట. అలా కేసీఆర్ అసెంబ్లీలో అందరినీ కొద్దిసేపు నవ్వించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: