వైసీపీ నాయకుడు కదా అని 30 ఇయర్స్ ఇండస్ట్రీకి పిలిచి ఎస్వీబీసీ పదవి ఇస్తే ఏం జరిగిందో తెలిసిందే కదా. పార్టీ పరువు తీసేలా అతడు వ్యవహరించిన తీరు జగన్ ను బాధించిందట. అందుకే ఆయన తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. అదేంటంటే.. ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని ఆయన కొంత కాలం ఖాళీగా ఉంచాలని నిర్ణయించారట.
ప్రస్తుతం టీటీడీ అడిషనల్ డైరెక్టర్ ధర్మారెడ్డికే శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ఎండీగా బాధ్యతలు అప్పగించారు. పృథ్వీ రాజీనామా అనంతరం.. ఎస్వీబీసీ డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారిలో ఒకరిని ఛైర్మన్గా ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. కానీ జగన్ మాత్రం ఈ విషయంలో తొందరపడకూడదని నిర్ణయించారట.
పృథ్వీ తీసుకొన్న నిర్ణయాలు ఎస్వీబీసీ ఛానల్ ప్రతిష్టను దిగజార్చాయని భావించిన జగన్ కొత్త ఛైర్మన్ ను ఎంపికను తాత్కాలికంగా నిలిపేశారు. ఎస్వీబీసీ ఛానల్ను గాడిలో పెట్టే లక్ష్యంతో ధర్మారెడ్డికి ఎండీ గా బాధ్యతలు అప్పగించింది. ఇపుడున్న ఇద్దరు డైరక్టర్లకు తోడుగా మరో ఇద్దరిని కొత్తగా డైరక్టర్లను ఎంపిక చేస్తారట. ఎస్వీబీసీ బోర్డు డైరెక్టర్లుగా సినీ దర్శకుడు శ్రీనివాసరెడ్డి, జర్నలిస్ట్ స్వప్న వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.