భారత క్రికెట్‌లో కొత్త అధ్యాయం మొదలవబోతోంది. టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా 25 ఏళ్ల యువ సంచలనం శుభ్‌మన్ గిల్ బాధ్యతలు చేపట్టనున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇక దూకుడైన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా ఉండబోతున్నాడట. ఇటీవలే టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్ శర్మ తప్పుకోవడంతో, ఖాళీ అయిన కెప్టెన్సీ పగ్గాలను ఈ యువ ద్వయం అందుకోనున్నట్లు సమాచారం.

రోహిత్ వైదొలగడంతో టెస్ట్ కెప్టెన్సీ ఖాళీగా ఉంది. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రెండు టెస్టులకు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా ఉన్నా, అతన్ని ఫుల్-టైమ్ కెప్టెన్‌గా చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావించడం లేదట. దీనికి ప్రధాన కారణం బుమ్రాకు తరచుగా గాయాలవడం. అతన్ని దీర్ఘకాలం కెప్టెన్‌గా ఉంచడం రిస్క్ అని భావిస్తున్నారని సమాచారం.

టీమిండియా ముందున్న తదుపరి పెద్ద సవాల్ నాలుగో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్. ఇది జూన్‌లో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌తో ప్రారంభం కానుంది. గత 15 ఏళ్లుగా భారత్ నిలకడైన జట్టుగా ఉన్నా, డబ్ల్యూటీసీ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. 2021 ఫైనల్‌లో న్యూజిలాండ్‌ చేతిలో, 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఇక గత సైకిల్‌లో, సొంతగడ్డపై న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో, ఆస్ట్రేలియాలో 3-1తో ఓడి ఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయింది.

శుభ్‌మన్ గిల్ 2020లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అద్భుతమైన టాలెంట్ ఉన్నా, టెస్ట్ క్రికెట్‌లో ఇంకా తన పూర్తి స్థాయి ప్రదర్శన ఇవ్వలేదు. ఇప్పటివరకు అతను 32 టెస్టులు ఆడి, 35.05 సగటుతో 1893 పరుగులు చేశాడు. అయితే విదేశాల్లో అతని రికార్డు అంత బలంగా లేదు. 28 ఇన్నింగ్స్‌లో కేవలం 27.5 సగటుతో 716 పరుగులు మాత్రమే చేశాడు.

రిషబ్ పంత్ విషయానికి వస్తే.. టెస్టుల్లో అతనిది తిరుగులేని ప్రదర్శన. జట్టులో అతని స్థానం ఖాయమైంది ఈ ఫార్మాట్‌లోనే. పంత్ టెస్టుల్లో ఏకంగా ఆరు సెంచరీలు బాదాడు. అందులో నాలుగు విదేశాల్లోనే, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలో టెస్ట్ సెంచరీలు చేసిన ఏకైక ఆసియా వికెట్ కీపర్ అతనే. అంతేకాదు, అతను ఏడు సార్లు 90ల్లో అవుటయ్యాడు. ఇది అతని నిలకడకు, మ్యాచ్‌పై అతని ప్రభావానికి నిదర్శనం.

ఇప్పుడు గిల్, పంత్ యువ జోడి టెస్ట్ టీమ్ పగ్గాలు అందుకోబోతుండటంతో వీరిద్దరూ కలిసి టీమిండియాకు తొలి డబ్ల్యూటీసీ టైటిల్‌ను అందిస్తారని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: