నేటి సమాజంలో
స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరికీ అవసరమైన వనరుగా మారిపోయింది. తిండి లేకుండా ఉంటారేమో గానీ
స్మార్ట్ ఫోన్ లేకుండా చాలా మంది ఉండలేకపోతున్నారు. అదేవిధంగా రోజురోజుకూ
టెక్నాలజీ కూడా తన ఎదుగుదలను పెంచుకుంటూ పోతోంది. యూజర్లకు తగినట్లు రకరకాల ఫీచర్లు పుట్టుకొస్తున్నాయి. ఈ తరుణంలో
స్మార్ట్ ఫోన్ ప్రియులకు ఓ
గుడ్ న్యూస్ అందింది.
స్మార్ట్ ఫోన్ యూజర్లు ఇకపై నడుచుకుంటూనే మొబైల్ ఫోన్లను వాడుకోవచ్చు. ఇందుకోసం హైటెక్ థర్డ్ ఐ రెడీ అయిపోయింది.

ఈ థర్డ్ ఐ ని తీసుకున్నవారు ఏ ప్రదేశాల్లో అయినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తూనే మొబైల్ ఫోన్ను వినియోగించవచ్చు. అచ్చం సీసీటీవీ కెమెరా మాదిరిగా ఉండే ఈ డివైజ్ను ఇండస్ట్రియల్ డిజైన్ స్టూడెంట్ అయిన మిన్వూక్ పెంగ్ తయారుచేశారు. చాలా మంది వాకింగ్ చేస్తూ, డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా స్మార్ట్ఫోన్లను వాడుతుంటారు. ఆ టైంలో ముందు ఎవరు వెళ్తున్నారో, ఎవరు వస్తున్నారో కూడా తెలియకుండా స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తుంటారు. ఇలానే చాలా మంది
స్మార్ట్ ఫోన్ వినియోగిస్తూ తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.

యువత ఎక్కువగా
స్మార్ట్ ఫోన్ ప్రేమలో మునిగిపోతున్నారు. ఇలాంటి సమస్యలకు
చెక్ పెట్టేందుకు ఇండస్ట్రియల్ డిజైన్ స్టూడెంట్ అయిన మిన్వూక్ పెంగ్ హైటెక్ థర్డ్ ఐని రెడీ చేశారు. మన కళ్ళు రెండూ
ఫోన్ వైపు చూస్తున్నప్పుడు, మూడవ కన్ను చురుకుగా మారుతుందని, దీని సాయంతో ప్రమాదాలు జరుగడానికి ఆస్కారం లేదని పెంగ్ చెప్తున్నాడు. ఇన్స్టాగ్రామ్లో
చాటింగ్, బ్రౌజ్ చేస్తున్నప్పుడు రద్దీగా ఉండే ప్రదేశంలో కూడా సులభంగా నడుస్తూ వెళ్లిపోవచ్చని అభయమిస్తున్నాడు.
ఈ థర్డ్ ఐ మన తలకు బిగించుకోవాలి. తల ఎప్పుడైతే క్రిందికి వస్తుందో అప్పుడు థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుందని పెంగ్ పేర్కొన్నారు. ఈ థర్డ్ ఐ పారదర్శక ప్లాస్టిక్ను కలిగి ఉంటుంది. ఇది డాట్ వంటి జెల్ ప్యాడ్ సాయంతో నుదిటిపై అతికించుకోవాలి. ఈ ప్లాస్టిక్ లోపల చిన్న స్పీకర్, గైరోస్కోప్ , సోనార్ సెన్సార్ అమర్చబడి ఉంటాయి. వినియోగదారు తన తలను కిందికి దించిన వెంటనే థర్డ్ ఐ పని చేయడం ప్రారంభిస్తుంది.