రాష్ట్రాల్లో పండిన వరి పంటను ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కొంటున్నాయి. అయితే ఇందుకు చాలా రోజులు సమయం పడుతోంది. ఈ సమయంలో అనుకోకుండా వర్షం వస్తే ధాన్యం మొత్తం తడిసిపోతోంది. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తగినన్ని గోడౌన్ లు లేకపోవడం, ఉన్న రైస్ మిల్లుల్లో ఖాళీ జాగా లేకపోవడం వల్ల వర్షాలకు భయపడి రైతులు ఇప్పటికీ తమ ఇండ్లలోనే పంటను పెట్టుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసేలా అధికారులను సర్కారు ఆదేశించినా ఆలస్యం జరుగుతోంది.


ధాన్యం తడిసి కూడా రైతులు నష్టపోతున్నారు. ఆ నష్టాన్ని నివారించడానికి వర్షాలు రాకముందే ఇక మీదట వచ్చే పంటను డెడ్ లైన్ తేదీ నిర్ణయించి కొనుగోలు చెయ్యాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే.. ఈ ఇబ్బందులు తొలగించేందుకు చేవెళ్ల మాజీ ఎం.పి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓ సూపర్ ఐడియా ఇచ్చారు. స్వయంగా పారిశ్రామిక వేత్త అయిన మాజీ  ఎంపీ  కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. అకాల వర్షాల నుండి ధాన్యాన్ని తాత్కాలికంగా కాపాడుకోవడానికి స్ట్రెంచ్ ఫిల్మ్‌ రోల్‌ ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు.


ఈ స్ట్రెంచ్ ఫిల్మ్‌ రోల్‌ ద్వారా తక్కువ ధరలో పంటను కాపాడుకోవచ్చు. ఇలా ప్లాస్టిక్ కవర్ చుట్టే విధానాన్ని రైతులకు అందరికీ తెలిసేలా, ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ సూచిస్తున్నారు. ఈ మేరకు ఆయన వ్యవసాయ మంత్రిని ఇటీవల కలసి తన అభిప్రాయాలు చెప్పారు.  ఎంపీ ప్రయత్నాన్ని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అభినందించారు. మీరు రైతుల మంచి కోసం చేసిన ఆలోచన అన్న మంత్రి.. స్ట్రెచ్ ఫిల్మ్ రోల్ తయారీదారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.


ఈ స్ట్రెంచ్ ఫిల్మ్‌ రోల్‌ పద్ధతిని తప్పకుండా ఆచరణలో పెట్టడానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారట. నిజమే ఇలాంటి వినూత్న ఆలోచనలు ఎక్కడ ఉన్నా స్వాగతించాల్సిందే. ఇలాంటి ఆధునిక పద్దతులు మన రైతులకు అందించాల్సిందే. ఇలాంటి ప్రయత్నం చేసిన మాజీ  ఎంపీ  కొండా విశ్వేశ్వర్ రెడ్డిని అభినందించాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: