ఆంధ్రప్రదేశ్ లో గత ఏడాది ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది వైసీపీ.  ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆనాటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు తాను ఇచ్చిన.. ఇస్తున్న హామీలపై ఫోకస్ పెట్టారు.  ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం అమలు చేస్తే అందరికీ మంచి భవిష్యత్ ఉంటుందని ఆయన భావించారు. పేదలకు ఉన్నత విద్యను అందించాలని సీఎం జగన్‌ తపన పడుతుంటే ఎలా అడ్డుకోవాలా అని టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఏపీ మంత్రి అనిల్ కుమార్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం అమలును హైకోర్టు అడ్డుకుంటే టీడీపీ నేతలకు ఆనందంగా ఉందని ఎద్దేవా చేశారు. 

 

టీడీపీ నేతలు, పత్రికాధినేతలు తమ పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ను అమెరికాలో చదివించుకోవచ్చా? మనవడు దేవాన్ష్‌ను తెలుగు మీడియంలో ఎందుకు చేర్పించలేదు? మీకో న్యాయం, పేదలకు మరో న్యాయమా?  పెద్దోళ్లకు ఒక న్యాయం చిన్నోళ్లకు ఒక న్యాయామా అని ప్రశ్నించారు.  ఎవరెన్ని కుట్రలు చేసినా ఇంగ్లిష్‌ మీడియం అమలు చేస్తాం.

 

రాబోయే 20 ఏళ్లలో మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా తయారుచేస్తాం అని అనిల్ అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి వేసిన మూడు ప్రశ్నలకు మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సమాధానం చెప్పాలని మంత్రి అనిల్ సవాలు విసిరారు. ప్రభుత్వ యంత్రాంగం, వైద్య, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తుంటే ఇవేవీ గమనించకుండా తన కుళ్లు రాజకీయాలు హైదరాబాద్ నుంచే చంద్రబాబు నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: