ప్రస్తుతం అమెరికాతో అణుచర్చలు జరిపే ఆలోచన ఏమీ లేదని ఉత్తర కొరియా తేల్చిచెప్పింది. తమపై అగ్రరాజ్యం శత్రుత్వ భావన విడిచిపెట్టేంత వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ విలేకరులతో మాట్లాడుతూ... ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్​తో ట్రంప్ మరో శిఖరాగ్ర సమావేశం నిర్వహించే అవకాశముందని పేర్కొన్నారు. బహుశా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అంటే అక్టోబర్​లో ఈ సమావేశం జరిగే అవకాశముందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై ఉత్తర కొరియా మొదటి ఉప విదేశాంగమంత్రి చో సోన్ హుయ్ భిన్నంగా స్పందించారు. ప్రస్తుతానికి అగ్రరాజ్యంతో అణు చర్చలు జరిపే ఆలోచన ఏమీ లేదని స్పష్టం చేశారు.

 


ఇటీవలి కాలంలో దాయాది దక్షిణ కొరియాపై కూడా ఉత్తర కొరియా ఒత్తిడి పెంచింది. తన భూభాగంలోని ఇంటర్ కొరియన్ కార్యాలయాన్ని పేల్చివేసింది. ద్వైపాక్షిక సైనిక ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటామని హెచ్చరించింది.

 

నవంబర్​లో అమెరికా అధ్యక్ష అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కొంత మంది విశ్లేషకుల ప్రకారం.. కనీసం అప్పటివరకు అగ్రరాజ్యంతో అణు చర్చలు జరపకూడదని ఉత్తర కొరియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అగ్రరాజ్య నాయకత్వం మారే అవకాశముండడమే.

మరింత సమాచారం తెలుసుకోండి: