నిన్న ఏపీలో దేవినేని ఉమా మీద జరిగిన దాడి కలకలం రేపుతోంది. వైసీపీ అరాచకపాలన, మైనింగ్ మాఫియా, అవినీతి-అక్రమాలు-ఆగడాలకు అడుగడుగునా అడ్డుపడున్నారనే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై రాజారెడ్డి రాజ్యాంగం ప్రయోగించారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.దేవినేనిపై దాడిచేసిన నిందితులను ఐపీసీ సెక్షన్లు కింద కేసులుపెట్టి, అరెస్ట్ చేయాల్సిన పోలీసులు, ఉల్టా ఆయనపైనే వైసీపీ సెక్షన్ల కింద కేసులుపెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అంటూ నారా లోకేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. బాధితుల్ని నిందితుల్ని చేసిన దుర్మార్గమైన పోలీసు వ్యవస్థ ఏపీలో వుండటం దురదృష్టకరమన్న ఆయన ఒక మాజీ మంత్రినే చట్టవ్యతిరేకంగా ఇంతగా హింసిస్తుంటే..సామాన్యుల పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. చట్టాన్ని చుట్టం చేసుకున్న పోలీసులూ! తాడేపల్లి కొంప కనుసైగలే చట్టంగా నిర్ణయాలు తీసుకున్న మీ బాస్కి పట్టిన గతే...మీకూ తప్పదంటూ హెచ్చరించారు. కొద్దిగా టైము పడుతుందంతేనన్న ఆయన చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకుని అన్యాయంగా వ్యవహరిస్తున్నా...న్యాయం ముందు దోషులుగా నిలబడక తప్పదని హెచ్చరించారు.