ఈ ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించిన పెట్టుబడుల ఉపసంహరణ లో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయనున్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ వాటాను 56 శాతం నుండి 26 శాతానికి తగ్గించడానికి నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఎల్.ఐ.సి. లో మెజారిటీ వాటాను ప్రైవేట్ పరం చేసేసింది. తద్వారా ఐ.డి.బి.ఐ బ్యాంకును ప్రైవేట్ పరం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత కేవలం గత నాలుగు ఏళ్లలో 14 ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈ సమ్మె చేపట్టనున్నట్టుగా ఇప్పటికే యునైటెడ్ ఫోరమ్ అఫ్ బ్యాంకు యూనియన్ కన్వీనర్ మహేష్ మిశ్రా తెలిపారు. ఈ నెల 16, 17 తేదీలలో రెండు రోజులు సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతుంది.
ఫ్రెండ్లీ బ్యాంకింగ్ విధానానికి మరియు దేశాభివృద్ధి సంబందించిన అంశాలకు తాము మద్దతు పలుకుతామని కానీ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయడానికి మాత్రం మద్దతు ఇవ్వలేమని మిశ్రా స్పష్టం చేశారు. ఈ విధానం ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేసే దిశగా వెళ్తుందని, అలాంటి విధానానికి తాము మద్దతు ఇవ్వలేమని ఆయన తెలిపారు. ఈ ధర్నాలో అల్ ఇండియా బ్యాంకింగ్ ఎంప్లొయీస్ అసోసియేషన్, అల్ ఇండియా బ్యాంకింగ్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, నేషనల్ కాన్ఫెడరేషన్ అఫ్ బ్యాంకు ఎంప్లాయిస్, అల్ ఇండియా బ్యాంకింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్, బ్యాంకింగ్ కాన్ఫెడరేషన్ అఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ బ్యాంకు ఎంప్లాయిస్ ఫెడరేషన్, ఇండియన్ నేషనల్ బ్యాంకు ఆఫీసర్స్ కాంగ్రెస్, నేషనల్ ఆర్గనైజషన్ అఫ్ బ్యాంకు వర్కర్స్, నేషనల్ ఆర్గనైజషన్ అఫ్ ఆఫీసర్స్ సంఘాలు పాల్గొంటున్నాయి.