ప్రశ్నించడానికే ప్రాదుర్భవించిన పార్టీ ఏదైనా ఉంటే.. అది జనసేనే! ఎక్కడ ఎలా ప్రశ్నించాలో అన్న విషయాన్ని పక్కన పెట్టి.. ప్రశ్నించడంలోనూ రాజకీయాలు చేయడం ఈ పార్టీ ప్రధాన కర్తవ్యంగా ఇటీవల మారిపోయింది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉంటే.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాల్సిన జనసేనాని పవన్.. ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. జగన్ను ఆడిపోసుకున్నారు. ఈ విషయం సర్వత్రా విస్మయాన్ని సృష్టించింది. ఎన్నికలకు ముందు తర్వాత.. అన్న విధంగా ఆయన దూకుడు రాజకీయాల్లో జోక్లు పేల్చింది. ఇక, ఇప్పుడు కూడా కరోనా సమయంలో పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై సర్వత్రా విస్మయం, వ్యంగ్యం కూడా ఉద్భవిస్తోంది.
తాజాగా ఏపీలో మద్యం దుకాణాలు తెరిచారు. మద్యం ధరలు పెంచారు. లాక్డౌన్ నేపథ్యంగా మార్చి 22న మూసిన దుకాణాల ను తెరవడం అనేది ఇప్పుడే. దీంతో మద్యం ప్రియులు రోడ్డునపడి దుకాణాల ముందు క్యూలు కట్టారు. కొన్ని చోట్ల లాక్ డౌన్ నిబంధనలు కూడా పాటించలేదు. భౌతిక దూరం మాట కూడా కనిపించలేదు. మొత్తంగా చూస్తే.. ఈ పరిస్థితిని పేర్కొంటూ.. జనసేనాని పవన్ భారీ ఎత్తున ఫైరయ్యారు. ఠాట్ ! నువ్వు మద్యం దుకాణాలు తెరవబట్టే కదా.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. నీకు మందుమీద, రాబడిమీద ఉన్న శ్రద్ధ.. ప్రజల ఆరోగ్యం మీద ఏమాత్రం లేదని సీఎం జగన్ను ఉద్దేశించి పవన్ ఈసడించారు.
అంతేకాదు, కరోనా ఎఫెక్ట్ తగ్గేవరకు కూడా మద్యం అమ్మకాలు నిలిపివేయాలని ఉచిత సలహా పడేశారు. దీంతో పవన్ను అంద రూ శభాష్! అద్భుతంగా స్పందించాడు! అని అంటారని పవన్ భావించి ఉండొచ్చు. కానీ, ఇక్కడ పవన్ అనుకున్నట్టు భుజకీర్తు లు ఎదురు రాలేదు. నిజానికి దేశంలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయంటే.. దాని వల్ల ఎదైనా కరోనా వ్యాప్తి పెరిగిందంటే.. పూర్తిగా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానిదే బాధ్యత. అంటే.. బీజేపీ పెద్దలదే బాధ్యత.
రాష్ట్రాలకు కరోనా సమయంలో సాయం చేయడం మానేసి మూడో దశ లాక్డౌన్లో మందు అమ్ముకుని ఖజానా నింపుకోవాలని సూచించింది, ఆఖరుకు రెడ్ జోన్లలో కూడా దుకాణాలు తెరవవచ్చని పేర్కొన్నది కేంద్రం. ఇప్పుడు పవన్ మిత్రపక్షమే కదాబీజేపీ! మరి తన బాధేదో.. అక్కడ చెప్పకుండా.. జగన్పై పడి ఏడిస్తే.. ఏం ప్రయోజనం?! అని పవన్ను ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా ప్రజలు. మరి దీనికి ఏం సమాధానం చెబుతారో చూడాలి.