ఉక్రెయిన్‌ దేశంపై రష్యా దురాక్రమణ, దాడి, యుద్ధం కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం మొదలై 14 రోజులు అవుతున్నా ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. రష్యా యుద్ధం ఆపడం లేదు. అయితే.. ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ ప్రపంచంలోనే ఇంత దారుణంగా మారణ కాండ జరగలేదన్న వాదన వినిపిస్తోంది. కేవలం 12 రోజుల వ్యవధిలోనే 1500 మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు మృత్యువాత పడ్డారు.. గతంలోనూ యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు జరిగినా.. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత మంది కేవలం యుద్ధం కారణంగా చనిపోయిన   ఘటనలు చరిత్రలోలేవని చెబుతున్నారు.


ఆధునిక కాలంలోనూ మనుషులను మనుషులే చంపుకునే దారుణాలు ఇప్పుడు రష్యా కారణంగా జరుగుతున్నాయి. ఇక ప్రత్యేకించి మేరియుపోల్‌ నగరంలోనైతే.. యుద్ధం కారణంగా చనిపోయిన వారికి సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యాలు చూస్తుంటే కడుపు తరుక్కపోతోంది. ఇంకా ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులతో విరుచుకు పడుతూనే ఉంది. ఈ యుద్ధంలో సామాన్య పౌరులను కూడా రష్యా విడిచి పెట్టడంలేదన్న విమర్శలు బాగా వస్తున్నాయి.


ప్రధాన నగరాలైన కీవ్, లెవివ్‌ వంటి చోట్ల రష్యా సైన్యం ఏకంగా నగరాల్లోకి నివాస గృహాలపైనే క్షిపణులు, బాంబులతో దాడులు చేస్తోంది. దీంతో మేరియుపోల్‌ పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. అధికారికంగా చెప్పకపోయినా వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఒక్క మేరియపోల్‌లోనే 12 రోజుల్లో 1500లకు పైగా జనం చనిపోయారని ఉక్రెయిన్‌ మంత్రి దిమిత్రో కుబేలా చెబుతున్నారు.


ఇప్పుడు ఈ మేరియుపోల్ ఘటన ఈ భూమి మీదనే జరిగిన అత్యంత దారుణమైన మానవతా విపత్తు అంటోంది పశ్చిమ దేశాల మీడియా. రష్యాకు కొరకరాని కొయ్యగా మారిన ఉక్రెయిన్‌ను పుతిన్‌ సైన్యం నేరుగా ఎదుర్కోలేక నిరాయుధులపై బాంబులు వేస్తోందని  ఆ దేశం ఆరోపిస్తోంది. వందల సంఖ్యల్లో మరణిస్తున్న పౌరుల అంత్యక్రియల కార్యక్రమాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పాలు పంచుకుంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: