
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత పార్టీ ఆత్మపరిశీలన చేయకుండా, కొందరు నేతలు స్వీయ నిర్ణయాలతో ముందుకు సాగడం, పార్టీకి భారంగా మారుతుందన్న అభిప్రాయం రోజురోజుకూ బలపడుతోంది. గత ఎన్నికల్లో విజయం సాధించిన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో, కనీసం ఇద్దరు ముగ్గురు పార్టీ ప్రస్తుత ధోరణిపై అసంతృప్తిగా ఉన్నారు. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఓ ప్రముఖ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో కూటమిలోని ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై స్థానికంగా చర్చ నడుస్తోంది. “ఎవరి పార్టీ వారిదే” అంటూ ఆమె ఇచ్చిన వ్యాఖ్యలు, పార్టీ కార్యకర్తల్లో అయోమయం కలిగిస్తున్నాయి. ఆమె పార్టీ మారే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారాన్ని ఆమె తిప్పికొడుతున్నా, ఆచరణలో మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నట్లు సమాచారం.
ఇలాంటి పరిస్థితి మరో గిరిజన నియోజకవర్గ ఎమ్మెల్యే విషయంలోనూ కనిపిస్తోంది. తన నియోజకవర్గ అభివృద్ధి పనులు సజావుగా సాగాలంటే, అధికార కూటమి నేతలతో కలసిమెలసి ఉండాల్సిన అవసరం ఉందంటూ ఆమె ఓపెన్గానే చెపుతున్నారట. పైగా, తమ పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితిలో లేదని, ప్రజల్లో వైసీపీపై నమ్మకం తగ్గిపోతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. మరో నాలుగేళ్ల పాటు ప్రోగ్రామ్లు ఎలా చేయాలి.. ఈ ఖర్చంతా ఎవరు భరిస్తారని కూడా ఆమె సొంత పార్టీ కేడర్నే ఎదురు ప్రశ్నిస్తున్నారట. అందుకే వారు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూపులు చూస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి నేతలకు నమ్మకం, భరోసా కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు. జగన్ పాత విధానాలనే కొనసాగిస్తూ, అసంతృప్త నాయకులను పట్టించుకోకుండా ముందుకు సాగితే, వైసీపీ మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఓటమిని తేలిగ్గా తీసుకుని ప్రజలకు దూరంగా ఉంటే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా బయటకు వెళ్లే అవకాశాలు లేకపోలేదు.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు