కర్నూలు జిల్లాలో వైసీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో ఆదోని ఒకటి. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ రెండుసార్లు గెలిచిన నియోజకవర్గాల్లో ఆదోని ఒకటి, ఇక్కడ జగన్ ఇమేజ్‌తో పాటు, ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి కూడా స్ట్రాంగ్ ఉండటం వల్ల ఆదోని వైసీపీ కంచుకోటగా మారిపోయింది. మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి సోదరుడైన సాయి ప్రసాద్ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక 2009 ఎన్నికల్లో కేవలం 256 ఓట్ల తేడాతో టీడీపీ నేత మీనాక్షి నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు.

సాయిప్రసాద్ తర్వాత వైసీపీలోకి వచ్చేసి, వరుసగా 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇలా రెండుసార్లు తిరుగులేని మెజారిటీతో గెలిచిన సాయి ప్రసాద్ రెడ్డి...ఆదోనిలో దూకుడుగా పనిచేస్తున్నారు. ప్రతిపక్షానికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అధికారులని గ్రిప్ లో పెట్టుకుని కావాల్సిన పనులు చేయించుకుంటున్నారు. ముఖ్యంగా ఆదోని మున్సిపాలిటీలో అవినీతి ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో, మున్సిపాలిటీ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారు.

ప్రభుత్వ పథకాల అమలు, గ్రామ సచివాలయాలు ఇంకా అడ్వాంటేజ్ అవుతున్నాయి. నాడు-నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి జరిగింది. సచివాలయాల ద్వారా ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారం అవుతున్నాయి. అయితే నియోజకవర్గంలో తాగునీరు-సాగునీరు సమస్యలకు చెక్ పెడితే ఎమ్మెల్యేకు తిరుగుండదు. అటు టీడీపీ తరుపున మీనాక్షి నాయుడు గట్టిగానే పోరాడుతున్నారు. నాయుడుకు కూడా నియోజకవర్గంలో కాస్త మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ వైసీపీ అధికారంలో ఉండటం, సాయి ప్రసాద్ రెడ్డి స్ట్రాంగ్ గా ఉండటం వల్ల, ఆదోనిలో టీడీపీ పుంజుకోవడం చాలా కష్టం. ప్రస్తుతానికి ఆదోనిలో వైసీపీ ఫుల్ స్ట్రాంగ్‌గా ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో సైతం ఆదోని వైసీపీదే అని అంటున్నారు. ఇక ఏమన్నా మీనాక్షి నాయుడు పుంజుకుని, టీడీపీ గాలి ఉంటే వైసీపీకి గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి. లేదంటే ఆదోనిలో వైసీపీ జెండా కదపడం చాలా కష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: