జాతి వివక్ష ఎక్కడ ఉన్న తప్పుబట్టాల్సిందే. జాత్యహంకారం ఈ మధ్య కాలంలో మితి మీరిపోతోంది. తాజాగా జాత్యాహంకారాన్ని ప్రదర్శించిన బ్రిటీష్ ఎయిర్వేస్ సంస్థపై బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ మండిపడ్డారు. భారత్కు చెందిన దంపతుల పట్ల బ్రిటిష్ ఎయిర్వేస్ విమాన సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించారు. మూడేళ్ల చిన్నారి ఏడుస్తున్నాడనే కారణంతో విమానం నుంచి కిందికి దించేశారు. ఆ పసివాడికి బిస్కెట్లు ఇచ్చి ఊరుకోబెట్టడానికి ప్రయత్నించిన మరో జంటను కూడా నిర్దాక్షిణ్యంగా కిందకి దించేశారు.
ట్విస్ట్ ఏంటేంటే..ఆ చిన్నారి తండ్రి భారత ప్రభుత్వ రోడ్డు, రవాణా శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న ఉన్నతాధికారి. జులై 23న లండన్ నుంచి బెర్లిన్ వెళ్లే విమానంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆ చిన్నారి తండ్రి ఏపీ పాఠక్.. భారత విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు లేఖ రాశారు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు కూడా ఫిర్యాదు చేశారు.
తాజాగా దీనిపై స్పందించిన సినీ నటుడు రిషి కపూర్ ‘లండన్ విమాన ఘటన గురించి తెలుసుకుని నేను చాలా బాధపడ్డాను. విమానంలోని భారతీయుల్ని దించేయడం సరికాదు. ఇది జాతి వివక్షే. గతంలో నేను ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినప్పటికీ.. రెండు సార్లు బ్రిటిష్ ఎయిర్ వేస్ క్యాబిన్ క్రూ సిబ్బంది నాతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆ సంస్థ విమానాలను ఎక్కడం మానేశాను. మనకు గౌరవం ఇవ్వని ఇలాంటి విమానాలను ఇకపై ఎక్కడం మానేయండి. జెట్ ఎయిర్ లేదా ఎమిరేట్స్ విమానాల్లో ప్రయాణించండి. అక్కడ గౌరవం దక్కుతుంది’ అని ట్వీట్ చేశారు.