తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస విజయాలు సాధిస్తూ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించారు. పెళ్లి చూపులు చిత్రంలో అమాయకంగా కనిపించిన విజయ్ దేవరకొండ తర్వాత అర్జున్ రెడ్డి చిత్రంలో బోల్డ్, అగ్రెసీవ్ గా కనిపించాడు. ఇక విజయ్ దేవరకొండ చిత్రాలు అన్నీ ఇలాగే ఉంటాయా అనుకున్న సమయంలో పరుశరామ్ దర్శకత్వంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ‘గీతాగోవిందం’ చిత్రంలో కడుపుబ్బా నవ్వించడమే కాదు..ఎమోషనల్ గా అందరినీ ఎడిపించాడు.
ఈ చిత్రం రిలీజ్ కి ముందే నెట్టింట్లో ప్రత్యక్షం అయ్యింది...దాంతో ఈ చిత్రంపై అంచనాలు తగ్గాయి. కానీ థియేటర్లో రిలీజ్ అయిన మొదలు ఇప్పటి వరకు కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతుంది. 'గీతా ఆర్ట్స్ 2' బ్యానర్లో రూపొందిన ఈ సినిమా, 12 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ చిత్రం తన జోరును కొనసాగిస్తూ 25 రోజులను పూర్తి చేసుకుంది.
ఇప్పటికి 25 రోజులను పూర్తి చేసుకోవడం గొప్ప విషయమేమీ కాదు .. కానీ 402 థియేటర్లలో ఈ సినిమా 25 రోజులను పూర్తి చేసుకోవడమే చెప్పుకోదగిన విషయం. ఇక తెలుగు రాష్ట్రాల్లో 302 థియేటర్స్ లో ఈ చిత్రం 25 రోజులను పూర్తి చేసుకోగా, మిగతా ప్రాంతాల్లోని థియేటర్స్ ను కలుపుకోగా ఆ సంఖ్య 402కి చేరుకుంది. ఇప్పటి వరకు కొత్త చిత్రాలు వరుసగా వచ్చినా..గీతాగోవిందంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేకపోతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే..50 రోజులు అవలీలగా చేరిపోతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.