సూపర్ స్టార్ మహేష్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా సినిమా సర్కారు వారి పాట పై ఆయన అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి మది ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవల దుబాయ్ లో ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేగవంతంగా జరుగుతోంది. తన కెరీర్లో ఇప్పటి వరకు చేయని ఒక విభిన్నమైన పాత్రను ఈ సినిమాలో మహేష్ బాబు చేస్తున్నారని టాక్. బ్యాంకు మోసాలు కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ ఒక బ్యాంకు ఉద్యోగిని పాత్ర చేస్తుందని అంటున్నారు.

ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ మహేష్ బాబు తండ్రి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మాధవన్ విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. 14 రీల్స్ ప్లస్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలపై అత్యంత భారీ వ్యయంతో నిర్మితమవుతున్న ఈ సినిమాని మంచి మెసేజ్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాని తొలుత వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని భావించింది యూనిట్.

కానీ మరోవైపు ఇప్పటికే త్రివిక్రమ్ సినిమాకి డేట్స్ కేటాయించిన మహేష్ బాబు వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేసి రిలీజ్ చేసేలా యూనిట్ కి సూచనలు జారీ చేశారని, అతి త్వరలో సర్కారు వారి పాట తదుపరి షెడ్యూల్స్ కూడా హైదరాబాదులోనే నిర్వహించేలా పలు ప్రణాళికలు కూడా ఆయన దగ్గరుండి సిద్ధం చేయించినట్లు చెబుతున్నారు. అలానే ఈ సినిమా ఆగస్టు కల్లా పూర్తి చేసి దసరాకు రిలీజ్ చేసే ఆలోచనలో కూడా ఆయన ఉన్నారని, అనంతరం వెంటనే త్రివిక్రమ్ మూవీ షూటింగ్ మొదలెట్టేలా ప్లాన్స్ చేసారని అంటున్నారు. మరి ఇదే కనుక జరిగితే అనుకున్న దాని కంటే ముందుగా ప్రేక్షకాభిమానులు సర్కారు వారి పాట మూవీని థియేటర్స్ లో చూడవచ్చు...... !!

మరింత సమాచారం తెలుసుకోండి: