బాలీవుడ్‌లో తెలుగు సినిమాలు భారీగా వసూళ్లు చేస్తున్నాయి. హిందీ బెల్ట్‌లో మాస్‌ సినిమాలకి ఉన్న వ్యాక్యూమ్‌ని వాడుకుంటూ సూపర్‌ హిట్స్‌ కొడుతున్నాయి. దీంతో విజయ్ దేవరకొండ కూడా బాలీవుడ్‌ని సీరియస్‌గా తీసుకుంటున్నాడు. పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ఇమేజ్‌ కోసం ముంబయి గ్లామర్‌ని ప్రయోగిస్తున్నాడు.

విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాతో పాన్‌ ఇండియన్ మార్కెట్‌లో అడుగుపెడుతున్నాడు. పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోందీ సినిమా. బాక్సింగ్ లెజెండ్ మైక్‌టైసన్‌ కీ-రోల్ ప్లే చేస్తున్నాడు. బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్. తెలుగు, హిందీ బైలింగ్వల్‌గా రూపొందిన ఈ సినిమా దక్షిణాదిన మరో మూడు భాషల్లోనూ విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాతో  హిందీ బెల్ట్‌లో మంచి గుర్తింపు వస్తుందని ఆశపడుతున్నాడు విజయ్.

విజయ్‌ దేవరకొండ కెరీర్‌ బిగినింగ్‌ నుంచే మార్కెట్‌ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. 'అర్జున్‌ రెడ్డి'తో మిగతా భాషల్లోనూ పాపులారిటీ వచ్చాక మల్టిలింగ్వల్‌ విడుదలకు ప్లాన్ చేశాడు. తెలుగు, తమిళ్ లో  'నోటా' సినిమా విడుదల చేశాడు. అయితే ఈ మూవీ రెండు చోట్లా ఆశించినంతగా ఫలితాలు సాధించలేకపోయింది. ఆ తర్వాత 'డియర్‌ కామ్రేడ్' సినిమాని తెలుగు, తమిళ్, మళయాళీ, కన్నడలో విడుదల చేశాడు. ఈ సినిమా కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత నాలుగు భాషల్లో విడుదలైన 'వరల్డ్ ఫేమస్ లవర్' డిజాస్టర్‌ అయింది.  

విజయ్ దేవరకొండ 'లైగర్' తర్వాత సుకుమార్‌తో ఒక సినిమా, కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. సుకుమార్‌కి 'పుష్ప'తో హిందీ రీజియన్‌లో మంచి స్టార్డమ్ వచ్చింది. దీంతో సుక్కు, విజయ్ సినిమా కూడా లార్జ్‌ స్కేల్లోనే తెరకెక్కే అవకాశముంది. ఇక కిశోర్‌ సినిమా కూడా మల్టీలింగ్వల్‌గా వచ్చే అవకాశం ఉందట. అందుకే ఈ సినిమాకి హిందీలో స్టార్డమ్‌ ఉన్న కియారా అద్వానీని హీరోయిన్‌గా తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. 


చూద్దాం.. విజయ్ దేవరకొండ అంచనాలు ఎంతవరకు రీచ్ అవుతాయో.





మరింత సమాచారం తెలుసుకోండి: