ఆంధ్రావని రాజకీయాలలో చంద్రబాబు కన్నా జగన్ ఓ మెట్టు పైకి ఎక్కారు. ఆ విధంగా ఎదుగుదల సాధించారు. ఎవ్వరూ అనుకోని విధంగా ఆయన సీఎం అయి 30 నెలలు పూర్తయ్యాయి కూడా! ఆయన సాధించిన విజయాలు ఏవన్నది ప్రతిరోజూ సాక్షి మీడియా చెబుతుంది. అవి విజయాలో లేదా ఆయనకు మాత్రమే సాధ్యమయిన ప్రయత్నాలో ఇప్పటిదాకా తేలడం లేదు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం ముందూ వెనుకా అన్నది చూడకుండా పథకాల పేరుతో డబ్బులు పంచుతూనే ఉంది. అటు ఇటు కానీ హృదయం నీది ఎందుకురా ఆ తొందర నీకు అన్న పాట మాదిరిగా అస్సలు ఎందుకు డబ్బు సంచులు విసురుతున్నారో కూడా అర్థం కావడం లేదు. ఎందుకు ఈ పథకాలు ప్రవేశ పెట్టి జనాలను కూర్చో బెట్టి మేపుతున్నారో కూడా అర్థం కాదు.అయినా కూడా రాజకీయంలో అన్నీ అర్థం చేసుకోవడం,అన్నీ అర్థం కావడం అన్నవి జరగని పనులు.
ఇక ఆ రోజు జగన్ ఎలా ఉన్నారో చూద్దాం. చంద్రబాబు హయాంలో వెలువడిన నిర్ణయాలన్నింటినీ తప్పు పడుతూవచ్చారు. నిరుద్యోగ భృతి ఎందుకు వద్దు ఉద్యోగాలు ఇవ్వండి అంటూ అదొక పెద్ద స్కాం అని అన్నారు కూడా! ఇలా చాలా మాటలు అధికారంలోకి రాక ముందు కలెక్టరేట్ల ఎదుట దీక్షల పేరిట అంటూనే వచ్చారు. ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించి వైసీపీ చాలా యుద్ధమే చేసింది. రాజధాని పై కూడా మంచి రాద్ధాంతమే చేసినా అమరావతిని రాజధానిని చేయవద్దని మాత్రం చెప్పకపోవడం విడ్డూరం.