ఒంగోలు రౌడీల రూలింగ్ ముగిశాక బెజవాడ రౌడీల రూలింగ్ మొదలయింది. దీంతో రాష్ట్రంలో అరాచక వాదుల అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు ప్రజా ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. బెజవాడ కేంద్రంగా కొంత కాలంగా మౌనంగా ఉన్న రౌడీలు, లేదా రౌడీషిట్ నమోదయి ఉన్న కొందరు ప్రజా ప్రతినిధులు రెక్కీ కి సహకరించారని, తద్వారా రాధా ఇంటిపై దాడికి కూడా యత్నించారని విపక్షం అయిన టీడీపీ ఆరోపిస్తున్న మాట.
సాక్షాత్తూ ఓ రాష్ట్ర మంత్రి పాల్గొన్న సభలో రంగా విగ్రహావిష్కరణ వేళలో వంగవీటి రాధాను దృష్టిలో ఉంచుకుని రెక్కీ నిర్వహణ చేశారన్న వార్త ఒకటి ఆంధ్రావనిలో హల్ చల్ చేస్తోంది. నెట్టింట ట్రోల్ అవుతోంది. దీంతో జగన్ ప్రభుత్వం పై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. జగన్ సొంత మనుషులే ఈ రెక్కీ నిర్వహణకు ఉపయోగపడ్డారన్నది ప్రధాన అభియోగంగా టీడీపీ నుంచి వినిపిస్తోంది. దేవినేని అవినాశ్ మనుషులు కొందరు రాధాను లక్ష్యంగా చేసుకుని రెక్కీ నిర్వహించారని కూడా సమాచారం ఒకటి ఇప్పటికే వైరల్ అవుతోంది.
నిన్నటి వేళ కూడా ఓ అనుమానుడు అరవ సత్యం ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గా ఉన్న అరవ సత్యం ను పోలీసులు విచారించేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించి మరికొంత సమాచారం రావాల్సి ఉంది. రాధాను హతమార్చేందుకు ఆయన ఇంటి సమీపాన కూడా రెక్కీ నిర్వహించారని పోలీసులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో సీన్ లోకి టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చి రాధా కు ఫోన్ చేసి మాట్లాడారు. అదేవిధంగా దీనిపై మీడియాను కూడా అడ్రస్ చేస్తూ నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని విచారణకు ఆదేశించాలని డీజీపీని కోరారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారిని నియంత్రించాల్సిన బాధ్యత సీఎం పై ఉందని అంటున్నారీయన. ఇంతకూ వర్గ పోరులో లేదా ఆధిపత్య పోరులో కడదాకా నిలిచేదెవ్వరు నెగ్గేదెవ్వరు?