దొడ్డి దారిన సీఎం పదవి తెచ్చుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్‌కు తెలంగాణ ప్రభుత్వం గురించి గానీ, సీయం కేసీఆర్ గురించి గానీ మాట్లాడే అర్హత లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసిన ఆయన మాకు నీతులు చెప్పడమేంటని చౌహాన్‌పై మంత్రి ద్వజమొత్తారు. భయం అనే పదమే సీఎం కేసీఆర్‌ డిక్షనరీలో లేదని చౌహన్‌ గుర్తుంచుకోవాలన్నారు. శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

14 ఏండ్లు ఉద్యమం చేసి స్వరాష్ట్ర కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురించి మాట్లాడే హక్కు ఆయనకెక్కడిదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్   ప్రశ్నించారు. అసలు భయం అంటేనే కేసీఆర్ డిక్షనరీలో లేదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వాలనే ఎదిరించి ధైర్యంగా పోరాడిన కేసీఆర్‌.. మీ తాటాకు చప్పుళ్ళకు భయపడే వారు కాదని స్పష్టం చేశారు. నల్ల సాగు చట్టాలకు వ్యతిరేఖంగా పోరాడిన రైతులను చంపిన ఘనత, ఎదిరించిన వారిపై దాడుల చేసే సంస్కృతి వీరిదని ఆరోపించారు. ఇలాంటి వారు మాకు నీతులు చెప్పడం ఏంటి అని మండిపడ్డారు.

'అభివృద్ధిలో మధ్యప్రదేశ్ స్థానం ఎక్కడ? తలసరి ఆదాయంతో పాటు ఇతర రంగాల్లో అట్టడుగున ఉన్న మీ రాష్ట్రంతో మాకు పోలికేంటి? పెరుగుతున్న నిత్యావసరాలు, డీజిల్‌, పెట్రోల్‌ ధరలతో పేదలు ఎలా జీవిస్తారని బీజేపీ నేతలు ప్రశ్నించుకోవాలన్నారు. బీజేపీ నేతలది అధికారం, ధన వ్యామోహం. అంతేగానీ ప్రజా సమస్యలపై దృష్టిపెట్టిన దాఖాలు లేవు. సీఎం కేసీఆర్ బయట తిరగటం లేదంటున్న బీజేపీ నేతలు.. ప్రధాని మోదీ ఎన్నికల సమయంలో కాకుండా మరే రోజైనా బయటకు వచ్చారేమో చెప్పాలి. తెలంగాణ అభివృద్ది, తెలంగాణ ప్రజలకు ఏం చేయాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్. అయితే కార్పొరేట్ బాబుల జపం చేసే నైజం ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వానిది' అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్   ద్వజమొత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: