హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో వర్షాలు మరింత ఎక్కువగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి. తెలంగాణలోని జిల్లాలతోపాటు, ముఖ్యంగా హైదరాబాద్ వాసులు ఇబ్బంది పడుతున్నారు. అయితే గతంలో ఉన్న అనుభవాలతో ఈసారి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునగకుండా.. వర్షపునీరు జనావాసాలవైపు తోసుకుని రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో కొంతలో కొంత మేలు, అయినా కూడా మరో మూడు రోజులపాటు అప్రమత్తంగా ఉండాల్సిందేనంటున్నారు అధికారులుల. గ్రేటర్ పరిధిలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్ పరిధిలో అత్యథికంగా ఖైరతాబాద్ ప్రాంతంలో 3.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హఫీజ్ పేట, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో 2.6 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. మాదాపూర్ లో 2.1 సెంటీమీటర్లు, రాజేంద్రనగర్, రామచంద్రాపురం ప్రాంతాల్లో 1.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాగల మూడు రోజులు గ్రేటర్ పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. తెలంగాణలో నిజామాబాద్ జిల్లాల్లో అత్యథిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేసిన అధికారులు, గ్రేటర్ కు ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చారు. భారీ వర్షాలతో వీకెండ్ ఎంజాయ్ చేద్దామనుకున్నవారికి ఇబ్బందిగా మారింది. ప్రయాణాకలు ఇది సరైన సమయం కాదని చెబుతున్నారు. ఆదివారం షాపింగ్ లు, ఇతర సరదాలకు కూడా బ్రేక్ పడింది. వర్షాలకు ఎవరూ ఇల్లు కదిలే పరిస్థితి లేదు. రాగల 3 రోజులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదారబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.