నిన్న ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా కోసం విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ధర్మ పోరాట దీక్షలో పలువురు టీడీపీ నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. విభజన హామీల సాధన పోరాటంలో ఇక మిగిలింది దండోపాయం మాత్రమేననీ, సామ దాన భేద మార్గాలు అయిపోయాయన్నారు. భారత రాజ్యాంగంతోపాటు తన భార్యను కూడా ప్రధాని గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు.
భాజపాకి అధికార భిక్ష పెట్టింది ఎన్టీఆర్, చంద్రబాబులే అన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తే తెలుగువారు సహించరనీ, పిరికివారు కాదనీ, ఇక యుద్ధం మొదలైందని బాలయ్య ఆవేశపూరితంగా చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఒక్కో తెలుగువాడూ ఒక్కో విప్లవ యోధుడిగా మారాలని పిలుపునిచ్చారు. ప్రధానిని ఉద్దేశించి హిందీలో మాట్లాడుతూ… ‘నువ్వు ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ దాక్కున్నా భారతమాత నిన్ను క్షమించదు. సమాధి చేసేస్తుంది. ప్రజల దగ్గరకు వెళ్తే తరిమి తరిమి కొడతారు. పోరాటం మొదలైంది, మేం మౌనంగా ఇక కూర్చోమ’ని బాలయ్య అన్నారు. ఆంధ్రాలో ఒక్క సీటు కూడా భాజపా గెలవలేదన్నారు.
వైకాపా ఎంపీల రాజీనామాలను విషయాన్ని ప్రస్తావిస్తూ… వారు చేస్తున్న దీక్షలూ, వారి వెనకాల ఎన్ని ప్యాకేజీలు ఉన్నాయో, వాళ్ల మధ్య ఎంత అవగాహన ఉందో ప్రజలందరికీ తెలుసన్నారు. వాళ్లను అడ్డం పెట్టుకుని శిఖండిలాగ, ఒక కొజ్జాలా మోడీ రాజకీయాలు చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వాళ్లకీ వీళ్లకీ సీట్లు రావని బాలయ్య అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ లు మండి పడ్డారు.
బాలకృష్ణపై గవర్నర్ నరసింహన్ కు ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈరోజు ఉదయం నరసింహన్ ను వారు కలుసుకున్నారు. గవర్నర్ నరసింహన్ ను బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ కలిశారు. మోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.అనంతరం, మీడియాతో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, బాలకృష్ణపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ని కోరామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా అంగీకరించిన చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అన్నారు.