జగన్ సర్కారు అరాచకాలు చేస్తోంది.. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తోంది.. అంటూ చంద్రబాబు రోజూ మీడియా ముందు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై వైసీపీ కూడా దీటుగానే స్పందిస్తోంది. ఇప్పుడు ఏకంగా చంద్రబాబుకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే.. చంద్రబాబుకు నచ్చిన 10 గ్రామాలను ఎంచుకోవచ్చు. అక్కడ జన్మభూమి కమిటీల వలన జరిగిన అన్యాయాలపై.. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం వలన జరిగిన మేలుపై చర్చ పెడతారట.


మరి ఇందుకు చంద్రబాబు రెడీయా అని ప్రశ్నిస్తోంది వైసీపీ. చంద్రబాబుకు వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత సి.రామచంద్రారెడ్డి ఈ ఛాలెంజ్ విసిరారు. వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు గురించి అయ్యన్న పాత్రుడితో మాట్లాడించింది చంద్రబాబు నాయుడే అంటూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య అన్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో మరో 30 ఏళ్లు వైయస్‌ఆర్‌సీపీనే అధికారంలో ఉంటుందని చంద్రబాబుకు అర్థమయ్యింది. అందుకే అయ్యన్న పాత్రుడి ద్వారా టీడీపీ.. బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తుందని చెప్పించారన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 100 రోజుల పాలనలో చంద్రబాబు వంద అబద్ధాలు.. 101 కుట్రలు చేశారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగిన మాట వాస్తవమే ఐతే.. నిజంగానే 8మందిని హత్య చేస్తే.. ఎందుకు మీడియాలో రాలేదు.. అని ఆయన ప్రశ్నించారు.


గ్రామాల్లో జరిగే చిన్న చిన్న గొడవలను తన రాజకీయ ప్రయోజనాల కోసం బాబు పెద్దవిగా చూపుతూ రాద్ధాంతం చేస్తున్నారని రామచంద్రయ్య మండిపడ్డారు. పార్టీ కార్యక్రమాలకు ఎవరూ రాకపోవడంతో చంద్రబాబు డబ్బులిచ్చి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని రామచంద్రయ్య ఆరోపించారు. పెయిడ్‌ ఆర్టిస్ట్‌లను తీసుకొచ్చి వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కోడెల అరాచకాలపై సిట్‌ ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే.. చంద్రబాబు ఎందుకు మాట్లాడలేక పోతున్నారని ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: