ఏపీలో
బీజేపీ దూకుడు పెంచుతున్న వేళ.. దాన్ని అడ్డుకునేందుకు తాజాగా సీఎం
జగన్ కూడా అదే స్ధాయిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. తనను అదే పనిగా టార్గెట్ చేస్తున్న పురంధేశ్వరిని ఎలాగైనా పార్టీలోకి తీసుకురావాలని
ఆమె భర్త, పర్చూరు ఇన్ ఛార్జ్
దగ్గుబాటి వెంకటేశ్వరావుకు డెడ్ లైన్ పెట్టడం, అదే జిల్లాకు చెందిన చీరాల
టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ్ తో పాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని
వంశీ మోహన్ ను కూడా పార్టీలోకి ఆహ్వానించడం.
ఇవన్నీ ఇప్పుడు వైసీపీకి అత్యవసరమా అంటే అవుననే అంటున్నవారు ఆ పార్టీ పెద్దలు. కానీ పార్టీకి చెందిన మెజారిటీ నేతలు మాత్రం
జగన్ నిర్ణయాలపై పెదవి విరుస్తున్నారు.దగ్గుబాటి వెంకటేశ్వరావుకు భార్య పురంధేశ్వరిని పార్టీలోకి తీసుకురావాల్సిందే అంటూ డెడ్ లైన్ విధించడం వంటి కారణాలు ఇప్పుడు జిల్లాలో
వైసీపీ ప్రతిష్టను మసకబార్చే విధంగా ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది.
అయితే ఇలాంటి రాజకీయాలను దశాబ్దాల క్రితమే చవిచూసిన
దగ్గుబాటి ఊరుకుంటారా ? తన అనుచరులతో కలిసి నియోజకవర్గంలో బల ప్రదర్శన నిర్వహించి
వైసీపీ తీరును, ముఖ్యంగా
జగన్ తీరును ఎండగట్టారు. దీంతో రాజకీయాల్లో తలపండిన
దగ్గుబాటి తన సీనియార్టీని ఉపయోగించి వ్యూహాత్మకంగా పార్టీని వీడకుండానే పోరుకు సిద్ధమై
వైసీపీ పరువు తీసేలా కనిపిస్తోంది.
మరోవైపు కృష్ణాజిల్లా రాజకీయాల్లో కీలకమైన గన్నవరం నియోకవర్గంలో మొన్నటి ఎన్నికల్లో
వంశీ చేతిలో ఓడిన గన్నవరం
వైసీపీ ఇన్ ఛార్జ్ యార్గగడ్డ వెంకట్రావు కూడా
వంశీ రాకపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కొన్నేళ్లుగా నియోజకవర్గంలో
వంశీ తనతో పాటు అనుచరులపై పెట్టించిన కేసులను యార్గగడ్డతో పాటు ఆయన వర్గీయులు గుర్తుచేసుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. త్వరలో
జగన్ తో భేటీ అయ్యాక భవిష్యత్తుపై క్లారిటీ ఇస్తానని యార్గగడ్డ చెబుతున్నారు. మరోవైపు
వంశీ వైసీపీలోకి వెళితే ఆయన స్ధానంలో యార్గగడ్డను తమ పార్టీలోకి ఆహ్వానించాలని
టీడీపీ భావిస్తోంది. ఈ బాధ్యతను
టీడీపీ అదినేత చంద్రబాబు... మాజీ
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు అప్పగించారు. ఇక్కడ ఉప ఎన్నిక జరిగితే
టీడీపీ తరఫున యార్గగడ్డ అభ్యర్ధి అయినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.