ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఊహించని రీతిలో బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆయనను బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ డీజీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. సీఎస్ షోకాజ్ నోటీసు ఇచ్చిన అధికారే... ఆయన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.ఎల్వీ సుబ్రమణ్యం సీఎ్సగా గత
ఏప్రిల్ 6వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. సుమారు ఏడు నెలలకు పైగా ఆయన ఆ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పదవీకాలం మరో ఆరు నెలలు ఉండగా తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది.
తాజాగా
ఏపీ ప్రభుత్వ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఈ బదిలీపై ఘాటుగా స్పందించారు. ``సీఎస్ను తొలగించే అధికారం సీఎం గారికి ఉన్నప్పటికీ...ఈ తొలగించిన విధానం సరిగా లేదు. బాధ్యత లేని అధికారం చలాయించే
ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రుల మెడలకు ఉచ్చులా చుట్టుకుంటూ ఉంది. హిందూ దేవాలయాల్లో అన్య మతస్తులను తొలగించే విషయంలో గట్టిగా నిలబడినందుకు ఇది బహుమానం అయితే ఇంకా మరీ దారుణం.`` అని వ్యాఖ్యానించారు.
అయితే, ఈ ట్వీట్కు ముందు...ఎల్వీ బదిలీకి కారణమని భావిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్కు నోటీసు జారీ అవడంపైనా..ఐవైఆర్ ఆసక్తికరంగా స్పందించారు. ``ఇదేమీ కొత్తకాదు.ఈ జాడ్యం బాబు గారి హయాంలో మొదలై బలపడి ఇప్పుడు పరాకాష్ట చేరింది.
ముఖ్యమంత్రి కార్యదర్శి జి.ఎ.డి సెక్రెటరీగా ఉన్న తర్వాత సి ఎస్ కు పాలనలో పట్టు ఉండటం కష్టం. అన్ని అధికారాలు ఎటువంటి బాధ్యత లేని సీఎంవో సక్రమ పాలనకు ఆటంకం. దీనిపై నా ప్రజా వాజ్యం హైకోర్టులో పెండింగ్లో ఉంది.`` అని పేర్కొన్నారు. సీఎం కార్యదర్శిగా ఉన్న వ్యక్తికే జీఏడీ కార్యదర్శి బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తూ...ఐవైఆర్ గతంలో పిల్ దాఖలు చేశారు.