పార్లమెంట్ వింటర్ సెషన్ ఈసారి హీట్ పుట్టించనుంది. అధికార...ప్రతిపక్షాల మధ్య డైలాగ్
వార్ కు ఈ సమావేశాలు వేదిక కానున్నాయి. పలు కీలక బిల్లులను ఆమోదించుకునేందుకు
బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇరవై రోజుల పాటు సాగే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పలు ఆర్డినెన్సులు కూడా చట్ట రూపం దాల్చనున్నాయి.
మరికొన్ని గంటల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాల ప్రభావం ఈ సమావేశాలపై పడే అవకాశం ఉంది. శివసేనకు చెందిన 18 మంది
లోక్సభ సభ్యులు, ముగ్గురు
రాజ్యసభ సభ్యులు ప్రతిపక్ష బెంచ్లోకి మారడంతో శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. వచ్చే నెల13 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతి పక్ష పార్టీలు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఇప్పటికే సిద్ధం చేసుకున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాలు, జీఎస్టీ, ఎకానమీ స్లోడౌన్ అంశాలపై
పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని నిలదీయాలని ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. వ్యవసాయ, కార్మిక రంగాలకు సంబంధించిన అంశాలపై లెఫ్ట్ పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి.
మరోవైపు...టీఆర్ఎస్,
వైఎస్ఆర్ సీపీ ,తృణమూల్
కాంగ్రెస్ లాంటి ప్రాంతీయ పార్టీలు
స్థానిక అంశాలపై పట్టుబట్టాలని నిర్ణయించుకున్నాయి. రూలింగ్ పార్టీ
బీజేపీ మాత్రం ఈ సమావేశాల్లో పలు బిల్లులు ఆమోదించుకోవాలని, కీలక ఆర్డినెన్స్ లపై బిల్లులు తేవాలని ఆలోచిస్తోంది. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలను తిప్పికొట్టేందుకు కూడా సిద్ధమైంది. 20 రోజులు మాత్రమే సాగే ఈ సమావేశాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దని
బీజేపీ అధిష్టానం తన ఎంపీలకు దిశానిర్దేశం చేసింది. ఉభయ సభల ముందుకు రానున్న బిల్లులకు మద్దతు కూడగట్టేలా ఎత్తుగడలను రచిస్తోంది. ఈ నెల 26న సంవిధాన్ దివస్ను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజున పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఇక...గత పార్లమెంటు సమావేశాల్లో
ఆర్టికల్ 370 రద్దు,
ట్రిపుల్ తలాక్ లాంటి కీలక బిల్లులను
మోడీ సర్కార్ గట్టెక్కించుకుంది. ఈసారి కూడా మరిన్ని కీలక బిల్లులపై దృష్టి సారించింది. ఈ సమావేశాల్లో 27 బిల్లులను ప్రవేశపెట్టనుంది.
అయోధ్య రామాలయానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీం ఆదేశాల నేపథ్యంలో సంబంధిత బిల్లును కేంద్రం కీలకంగా భావిస్తోంది. ఈ బిల్లును కూడా ఈ సెషన్ లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి
కేంద్ర సాంస్కృతిక శాఖ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంది.
నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ ని దేశవ్యాప్తంగా అమలు చేయడం, పౌరసత్వ చట్టం విషయంపైనా
బీజేపీ సర్కారు క్లారిటీతో ఉంది.
బీజేపీ ఎజెండాలో
ఆర్టికల్ 370,
అయోధ్య, తర్వాత కామన్ సివిల్ కోడ్ ప్రధాన అంశంగా కనిపిస్తోంది. కామన్ సివిల్ కోడ్ కోసం ప్రజల అంగీకారం పొందాల్సి ఉంటుందని, అందుకే ఎన్ఆర్సీ బిల్లు గట్టెక్కిన తర్వాత దానిపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని సమాచారం. వీటితో పాటు కీలక ఆర్డినెస్సులను కూడా తీసుకురావాలని
కేంద్ర సర్కారు భావిస్తోంది. ఆదాయపు పన్ను చట్టం-1961, ఆర్థిక చట్టం-2019లను సవరిస్తూ, దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్నును తగ్గిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్తోపాటు ఇ-సిగరెట్ల అమ్మకం, ఉత్పత్తి, నిల్వలను నిషేధిస్తూ తెచ్చిన అర్డినెన్స్ పై కూడా
బీజేపీ సర్కారు ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.