మహా సంక్షోభం ఓ కొలిక్కి వచ్చి మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పీఠాన్ని శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే అధిరోహించనున్నారు. ఈ పరిణామానికి ముందే అనేక నాటకీయ ఘట్టాలు జరిగిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయాన్నేబీజేపీ నాయకుడు ఫడ్నవీస్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో రాజకీయ ప్రత్యర్థులు సుప్రీంకోర్టుకెళ్లారు. సుప్రీం కోర్టులో వాదనలు పూర్తయిన తరువాత ఈ నెల 27 సాయంత్రంలోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు తరువాత మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ 26న రాజీనామా చేశారు. అజిత్ రాజీనామా చేసిన కాసేపటికే ఫడ్నవీస్ కూడా పదవికి రాజీనామా చేశారు. ఇలా మూడు రోజుల సీఎం రికార్డును ఫడ్నవీస్ రికార్డు సృష్టించారు.
ఇదే రికార్డు మరో ఇద్దరు నేతల పేరుతో ఉంది. ఉత్తరప్రదేశ్కు మూడు రోజుల పాటు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత జగదాంబికా పాల్ పనిచేశారు. 1988 ఫిబ్రవరి 21న ప్రమాణస్వీకారం చేసిన పాల్, ఫిబ్రవరి 23న సీఎం పదవికి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని గవర్నర్ రమేష్ భండారీ బర్తరఫ్ చేసి, జగదాంబికా పాల్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించడంతో...అలహాబాద్ హైకోర్టును కల్యాణ్ సింగ్ ఆశ్రయించగా సర్కారుని బర్తరఫ్ చేయడం రాజ్యాంగ విరుద్దమంటూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో జగదాంబికా పాల్ రాజీనామా చేయడంతో, కల్యాణ్ సింగ్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అతి తక్కువ కాలం ముఖ్యమంత్రుల జాబితాలో కర్ణాటకకు ముఖ్యమంత్రిగా ఉన్న బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్ యడ్యూరప్ప కూడా ఉన్నారు. 2018లో మూడు రోజుల పాటు సీఎంగా ఉన్నారు. మే 17న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప మే 19న పదవి నుంచి దిగిపోయారు. తిరిగి మళ్లీ సీఎం పీఠం సొంతం చేసుకున్నారు.
ఈ ముగ్గురుతో పాటుగా అతి తక్కువ కాలం సీఎంగా ఉన్న వారెవరంటే...
జగదాంబికా పాల్ - కాంగ్రెస్ - ఉత్తరప్రదేశ్ - 2 రోజులు (1988 ఫిబ్రవరి 21- 23)
బీఎస్ యడియూరప్ప - బీజేపీ - కర్ణాటక - 2 రోజులు (2018 మే 17- 19) (మూడో దఫా సీఎంగా)
దేవేండ్ర ఫడ్నవీస్ - బీజేపీ - మహారాష్ట - 3 రోజులు (2019 నవంబర్ 23-26) (రెండో దఫా సీఎంగా)
సతీశ్ ప్రసాద్ సింగ్ - కాంగ్రెస్ - బీహార్ - 5 రోజులు (1968 జనవరి 28- ఫిబ్రవరి 1)
పీకే సావంత్ - కాంగ్రెస్ - మహారాష్ట్ర - 9 రోజులు(1963 నవంబర్ 25- డిసెంబర్ 4)
ఎస్సీ మారక్ - కాంగ్రెస్ - మేఘాలయ - 13 రోజులు (1988 ఫిబ్రవరి 27- మార్చి 10) (రెండో ధఫా)
జానకి రామచంద్రన్-అన్నాడీఎంకే - తమిళనాడు - 23 రోజులు (1988 జనవరి 7 - 30)
సీహెచ్ మహ్మద్ కోయా - ఐయూఎంఎల్ - కేరళ - 50 రోజులు (1979 అక్టోబర్ 12 - డిసెంబర్ 1)