మంత్రి బొత్ససత్యనారాయణ విశాఖ పర్యటనలో భాగంగా మెట్రో రైలు ప్రతిపాదిత మార్గాలను పరిశీలించారు. మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  విశాఖ ప్రజలకు మెట్రో రైలు సేవలు అందించేందుకు సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి  అన్నారు. విశాఖ అభివృద్ధికి సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారని.. ఇక్కడ చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. 

విశాఖ నగరాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. విశాఖ మెట్రో, ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్, బీచ్ బ్యూటిఫికేషన్ తదితర పనులు త్వరలోనే చేపడతామన్నారు. మొదటిగా గాజువాక నుంచి కొమ్మాది వరకు మెట్రో రూట్ అందుబాటులోకి తెచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నామన్నారు. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ వరకు పొడిగిస్తామన్నారు. వీలును బట్టి అక్కడి నుంచి లంకెలపాలెం వరకు మెట్రో రైల్‌ను పొడిగించేలా యోచిస్తున్నట్లు బొత్స చెప్పారు.అలాగే మధురవాడ నుంచి భోగాపురం వరకు మరో లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. వాటితోపాటు మరో రెండు సప్లిమెంటరీ లైన్స్ కూడా నిర్మించనున్నట్లు చెప్పారు. తాడిశెట్టిపాలెం నుంచి చిన వాల్తేరు.. గురుద్వార నుంచి పోస్టాఫీస్ వరకు మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. అలాగే ఆ తర్వాత అనకాపల్లి నుంచి భోగాపురం వరకు నిర్మించే యోచన కూడా ఉన్నట్లు చెప్పారు. 

ప్రస్తుతం ప్రతిపాదనలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్స్ రెడీ అవుతున్నాయని బొత్స తెలిపారు. మరో పది రోజుల్లో జరగనున్న ముఖ్యమంత్రి సమీక్షలో విశాఖ మెట్రో డిజైన్, రూట్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బొత్స పేర్కొన్నారు. అలాగే ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్ నిర్మాణం ఇప్పటికీ వెనుకబడి ఉందని.. కాంట్రాక్టు సంస్థ కుంటిసాకులు చెబుతోందంటూ అసహనం వ్యక్తం చేశారు. వచ్చే జూన్‌లోపు పూర్తి చేస్తామని కమిట్‌మెంట్ ఇచ్చారని.. తాము కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని చెప్పారు. 

విశాఖ మెట్రోకి సంబంధించి నిధుల లభ్యతపై మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నిధులా.. మనసుంటే మార్గం ఉంటది.. ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.. నిధులకేం ఢోకా లేదని బొత్స స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల అలసత్వం కారణంగా విశాఖ ప్రజలకు మెట్రో సౌకర్యం ఆలస్యమైందని.. తమ ప్రభుత్వం సకాలంలోనే పూర్తి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: