కడుపున పుట్టిన బిడ్డలు ఎలాంటివాడు అయినప్పటికీ ఆ తల్లి బిడ్డను సాకుతుంది. నానా కష్టాలు పడి పోషిస్తుంది. బిడ్డను పెంచి పెద్ద చేస్తుంది. చదువుకుంటే చదివిస్తుంది.. లేదంటే తానే కరిగిపోయి.. బిడ్డకు వెలుగును ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ, ఆ కొడుకులు ఏం చేస్తున్నారు. తల్లులకు గర్భశోకం మిగులుస్తున్నారు. తల్లులను తలెత్తుకోనివ్వకుండా చేస్తున్నారు. కూలి చేసుకుంటూ జీవనం సాగించే వ్యక్తులు తమ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారో ఎలా తిరుగుతున్నారో కేర్ తీసుకోవాలి అంటే ఎలా కుదురుతుంది.
రెక్కాడితేనే కానీ డొక్కాడదు. కూలికోసం వెళ్లొచ్చే వాళ్ళు పిల్లల మనస్తత్వం ఇలా ఉంటుంది అని ఎలా తెలుస్తుంది. దిశ హత్యకేసు నిందితుల విషయంలో ఇలానే జరిగింది. దిశ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మహ్మద్ ఆరిఫ్ జీవితం ఎలాంటిదో ఇప్పటికే తెలుసుకున్నాం. అయితే, అయన కుటుంబం కూడా పెద్దగా ఫోకస్ కాలేదు. ఆరిఫ్ మహ్మద్ 10 తరగతి వరకు చదువుకున్నారు. ఆరిఫ్ కు ఒక చెల్లి ఉంది. ఇంటర్ చదువుతున్నది. ప్రస్తుతం ఆమె హాస్టల్ లో ఉండి చదువుకుంటోంది. తండ్రి దినసరి కూలి. తల్లికి సరిగా కళ్ళు కనిపించవు. ఆరిఫ్ వచ్చిన డబ్బులను ఇంట్లో సరిగా ఇచ్చేవాడు కాదని, జల్సాలు చేసేవాడని తెలుస్తోంది.
ఇక జక్లేరు నుంచి పక్కనే ఉన్న గుడిగండ్ల గ్రామంలో చెన్నకేశవులు, శివ, నవీన్ లు ఉంటున్నారు. నవీన్ మనస్తత్వం గురించి గ్రామంలో కూడా చెడ్డపేరు ఉన్నది. నవీన్ ఎవరిని లెక్కచేసే మనస్తత్వం కాదని, డబ్బులు లేకున్నా అప్పులు చేసి బైక్ కొన్నాడని, బైక్ సైలెన్సర్ తీసేసి నడిపేవాడని గ్రామస్తులు చెప్తున్నారు. నవీన్ కూడా ఒక్కడే కొడుకు.. కొడుకు లేకపోవంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ఇక శివ కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే. అయితే, శివ కుటుంబంలో చిన్న వ్యక్తి. అక్కకు పెళ్లి చేశారు. అన్న కూలిపనులు వెళ్తున్నాడు. ఇందులో చివరి వ్యక్తి చింతకుంట చెన్నకేశవులు. ఆ కుటుంబానికి ఒక్కడే కొడుకు. తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నాడు. గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్య ఏడు నెలల గర్భవతి... కొడుకు ఇలాంటి తప్పుడు పనులు చేస్తాడని అనుకోలేదని గుట్టుగా ఉన్న కుటుంబాన్ని బజారుకు లాగాడని కుటుంబ సభ్యులు అంటున్నారు.