హైదరాబాద్లో ఐటీ ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్గా తేలిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా ప్రజల్లో కలవరం మొదలైన సంగతి తెలిసిందే. టెక్స్ లోని మైండ్ స్పేస్లో… బిల్డింగ్ నెంబర్ 20లోని 9వ ఫ్లోర్ లోఉన్న DSM కంపెనీలో ఓ మహిళా ఉద్యోగికి కరోనా పాజిటీవ్ నమోదైంది. దీంతో ఆ కంపెనీతో పాటు బిల్డింగ్ లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ఇంటినుంచి పనిచేయమని పంపించేశారు. దాదాపు మూడు వేల మంది ఇంటికి వెళ్లిపోయారు. దీంతో నగరంలోని తమ వారిపై అందరిలో ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. బయటి దేశాల నుంచి వచ్చిన వారి నుంచి మాత్రమే కరోన వైరస్ సోకుతుందని ఆయన స్పష్టం చేశారు. మాదాపూర్ మైండ్ స్పేస్లోని బిల్డింగ్ 20 లోని DSM కంపెనీ లో 350 మంది ఉద్యోగులు ఉన్నారని, అందులో వైరస్ వచ్చినట్లు అనుమానిస్తున్న మహిళతో పాటు మరో 23 మంది పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఆ 23 మంది సొంతంగాగా ఐసోలేషన్ తీసుకున్నారని వెల్లడించారు. వర్క్ ఫ్రం హోం వంటివి ప్రతిపాదనలేవీ తెరమీదకు రాలేదని ఆయన వెల్లడించారు.
ఐటీ కంపెనీలు మూసివేస్తున్నట్లు అసత్యప్రచారాలు చేయవద్దని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ కోరారు. ఐటి ఉద్యోగులు వారి కంపెనీ లలో నిర్భయంగా పనిచేసుకోవచ్చునని తెలిపారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఐటి కారిడార్కు నోడల్ అధికారిగా ఉంటారని, ఎవరికైనా ఎటువంటి అనుమానాలు ఉన్న సజ్జనార్ను అడిగి నివృత్తి చేసుకోవచ్చునని వెల్లడించారు. కోవిడ్ 19 వచ్చినట్లు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ సెలవు ప్రకటించాలనుకుంటే నోడల్ అధికారి సజ్జనార్ దృష్టికి తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు. వచ్చే రెండు నెలలు ఐటీ ఉద్యోగులు ఎటువంటి విదేశీ పర్యటనలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ, కరోన వైరస్ నేపథ్యంలో మాదాపూర్ ఐటి కారిడార్లో ఒక అమ్మాయికి కరోన వైరస్ సోకినట్టు ప్రచారం జరిగిందని అయితే, అందులో నిజం లేదని...అనుమానం మాత్రమేనని అన్నారు. అనవసరంగా ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తెలంగాణలో ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదు అయిందని సజ్జనార్ తెలిపారు. తెలంగాణలో నమోదైన కోవిడ్ 19 సోకిన రెండు కేసుల్లో పరీక్షల్లో గురువారం ఉదయం లోపు ఫలితాలు వస్తాయని వెల్లడించారు.