ఇప్పటికే ప్రపంచాన్ని గడగడ లాడిస్తోన్న కరోనా వైరస్ భారత్కు కూడా విస్తరిస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా అనుమానిత కేసులు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో తొలి కరోనా కేసు బైటపడింది. నెల్లూరు నగరంలో ఈ కేసు ఉందని ముందు నుంచి ఉన్న అనుమానం కాస్తా ఇప్పుడు పాజిటివ్ గా రిపోర్టు రావడంతో కరోనా భయం మరింత ఎక్కువైంది. ఇక కరోనా వైరస్ భయట పడిన నెల్లూరు జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది.
యూరప్ నుంచి ఓ యువకుడు నెల్లూరు వచ్చాడు. దీంతో అతడికి కరోనా ఉందన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కరోనా టెస్టులు చేయించగా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. అయితే దీనిని బయట పెట్టేందుకు అధికారులు మూడు రోజుల పాటు నాన్చి నాన్చి అసలు విషయం చెప్పారు. ఇప్పుడు ఆ యువకుడు నివాసం ఉంటే ప్రాంతమైన నెల్లూరులోని చిన్నబజారు ఏరియా మొత్తం ఖాళీ అయింది. చుట్టుపక్కలవాళ్లు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు, షాపులు మూతపడ్డాయి.
ఇప్పుడు నెల్లూరు వాళ్లు ఆ చిన్నబజారుకు పోవాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో దారుణం ఏంటంటే ఈ చుట్టు పక్కల ఏరియాల్లో ఉన్న వారు అయితే ఇళ్లకు తాళాలు వేసి కొద్ది రోజులు తమ బంధువుల ఇళ్లకు వేరే ఊళ్లకు వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యారు. ఇక వ్యాపారస్తులు కూడా షాపులు ఓపెన్ చేసేందుకు భయపడాల్సిన పరిస్థితి. ఇక ఓ ఇంటర్నేషనల్ సెమినార్ కోసం నెల్లూరు వచ్చిన విదేశీ టీమ్ వాళ్లు కూడా ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో ఉన్నారు.
ఇక ఇంటర్ పరీక్షల నేపథ్యంలో అధికారులు ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఇక నగరంలో థియేటర్లకు వెళ్లేందుకు కూడా జనాలు భయపడుతున్నారు. నెల్లూరులో మాత్రమే కాదు... తిరుపతి కొండ మీద కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటున్నారు. మరి ఈ భయం ఎలా పోతుందో ? చూడాలి.