దేశవ్యాప్తంగా కలవరం సృష్టిస్తున్న ఢిల్లీలోని తబ్లీగ్ మత ప్రార్థనల ఘట్టంలో మరో కీలక అంశం తెరమీదకు వచ్చింది. దేశంలో కరోనా అదుపులోనే ఉందనుకున్న సమయంలో ఒక్కసారిగా వందల సంఖ్యలో కేసులు పెరిగిపోవడం, దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో బాధితులు ఉండటంతో ఆందోళన పెరిగిపోయింది. ఇదే సమయంలో మర్కజ్ మత ప్రార్థనల కారణంగా కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిన తీరు కలవరం సృష్టించింది. ఈ ఘటన గురించి ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి.
ఇస్లాం మత పునరుజ్జీవం కోసం సున్నీ ఇస్లామిక్ మిషనరీగా హర్యానాలోని మేవాట్లో 1927లో మహమ్మద్ ఇలియాస్ అల్ కంధ్లావి అనే మత గురువు జమాత్ తబ్లిగి సంస్థను స్థాపించారు. జమాత్ తబ్లిగి ఆధ్యాత్మిక సమ్మేళనాలు రెండేళ్లకోసారి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్లో ఉన్న మర్కజ్ మసీదులో జరుగుతుంటాయి. జమాత్ జరిగే తేదీలను రెండేళ్ల ముందే నిర్ణయిస్తారు. దానికి హాజరయ్యే ప్రతినిధుల ఎంపిక మూడు నెలల ముందు మాత్రమే జరుగుతుందని సమాచారం.2019 డిసెంబర్లో మర్కజ్ కు వెళ్లే ప్రతినిధుల ఎంపిక జరిగినట్టు తెలిసింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. హైదరాబాద్ మల్లేపల్లిలో ఉన్న మర్కజ్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మర్కజ్ కు వెళ్లొచ్చేందుకు ఖర్చులను ఎవరికి వారే భరించాల్సి ఉంటుంది. అక్కడ భోజనం, వసతి మాత్రం జమాత్ తబ్లిగి నిర్వాహకులు కల్పిస్తారు. దీంతో పెద్ద సంఖ్యలోనే ఇటీవల ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం.
తెలంగాణ విషయానికి వస్తే...మర్కజ్లో జమాత్ తబ్లిగి ముందస్తు ఆహ్వానం మేరకు రాష్ట్రం నుంచి 1,030 మంది ప్రతినిధులు వెళ్లగా.. వారిలో 930 మందిని గుర్తించారు. మరో వంద మందిని ఇంకా గుర్తించాల్సి ఉంది. అయితే ఆహ్వానం లేకపోయినా అనధికారికంగా వెళ్లిన వారు వందల సంఖ్యలోనే ఉన్నారని అంచనా వేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లొచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు విచారించగా.. తమతోపాటు మరో ముగ్గురు వచ్చారని, వారి అడ్రస్ తమకు తెలియదని చెప్పినట్టు తెలిసింది. ఇలా ఎందరు వెళ్లి ఉంటారని దర్యాప్తు అధికారులు అన్వేషిస్తున్నారు.