అమెరికా కరోనాతో అల్లకల్లోలం అవుతున్న సంగతి తెలిసిందే. రోజూ కొన్ని వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయక్కడ. తాజా లెక్కల ప్రకారం అమెరికాలో నాలుగున్నర లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే.. దాదాపు 1300 మందికి పైగా కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గురువారం ఒక్క రోజే దాదాపు 20 వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇప్పటి వరకూ అమెరికాలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 16 వేలు దాటింది. ఈ సంఖ్య లక్షకు చేరుకోవచ్చని అమెరికా అధ్యక్షుడే చెబుతున్నాడు. ఇక అమెరికాలోని ఇండియన్స్ ను కూడా ఈ కరోనా మహమ్మారి వదలడం లేదు. కరోనా వైరస్ కారణంగా అమెరికాలోని భారతీయులు కూడా ఇక్కట్లు పడుతున్నారు. అమెరికాలో కరోనాతో మరణించిన వారిలో 11 మంది ప్రవాస భారతీయలు ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికాలో మరణించిన ఎన్నారైలల్లో 10 మంది న్యూయార్క్, న్యూజెర్సీ నగరాలకి చెందిన వారుగా గుర్తించారు. మరొకరు ఫ్లోరిడాలో నివాసం ఉంటున్నారు. ఇప్పటి వరకూ మరణించిన ఎన్నారైల్లో నలుగురు ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారు. మరో 16 మంది భారతీయులు స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు తెలుస్తోంది.
వీరిలో ఎనిమిది మంది న్యూయార్క్లో, ముగ్గురు న్యూజెర్సీలో, మిగిలినవారు టెక్సాస్, కాలిఫోర్నియాలో ఉన్నారని సమాచారం. స్వీయ నిర్భంధంలో ఉన్నవారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. వీరంతా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ట్రాలు చెందినవారని అధికారులు చెబుతున్నారు.