ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రశాంత మైన వాతావరణం కనిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్నటి వరకు సత్సంబంధాల తోనే నడిచారు. అయితే ఇప్పుడు పోతిరెడ్డి పాడు విషయం వీరిద్దరి మధ్య కాస్త కీచులాటకు కారణమై నట్టుగా కనిపిస్తోంది. పోతిరెడ్డిపాడు...ఇదే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. రాయలసీమ ప్రయోజనం కోసమని చెప్పి, ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచుతూ జీవో 203 విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవో వల్ల తెలంగాణకు తీవ్ర నష్టమని ఆ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడున్న ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. ఇక దీనిపై న్యాయపోరాటానికి కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమైంది కూడా.
పోతిరెడ్డిపాడు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని, సముద్రంలోకి వెళ్లే వృధా నీటిని వినియోగించుకోవడం కోసమే ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని ఏపీ ప్రభుత్వం అంటుంది. అయితే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి, ప్రతిపక్షాలు మద్దతు ఇస్తుంటే, ఏపీలో మాత్రం బీజేపీ తప్ప మిగిలిన ప్రతిపక్షాలు జగన్ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడటం లేదు. దీనిపై చంద్రబాబు ఇంతవరకు ఏమి మాట్లాడలేదు. కానీ పరోక్షంగా బాబుకు మద్దతుగా ఉంటూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలు జగన్ పైనే రివర్స్ లో విమర్శలు చేస్తున్నారు.
దీనిని బట్టి కాంగ్రెస్ వాళ్లు జగన్ టార్గెట్ గా చంద్రబాబు కోసం తెర వెనక తంతు బాగానే నడిపిస్తున్నట్టు గా చర్చలు నడుస్తున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా తులసిరెడ్డి లాంటి వారు పోతిరెడ్డిపాడు విషయం గురించి మాట్లాడకుండా, ఆంధ్రకి ఎగువనున్న తెలంగాణలో అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని, కృష్ణానది యాజమాన్య బోర్డు, అపెక్స్ కమిటీల నిబంధనలను తుంగలో తొక్కి ప్రాజెక్టులు నిర్మిస్తుంటే సీఎం జగన్ ఎందుకు మాట్లాడడం లేదని రివర్స్ లో ఎటాక్ చేస్తున్నారు. పోతిరెడ్డిపాడుపై మౌనం వహించిన చంద్రబాబుని వైసీపీ నేతలు ప్రశ్నిస్తుంటే, రివర్స్ లో బాబు కోసం కాంగ్రెస్ నేతలు జగన్ ని ప్రశ్నిస్తున్నారు.