లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులని నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా లాక్ డౌన్లో సడలింపులు రావడంతో, సామాజిక దూరం వచ్చేలా బస్సులో సీట్లని అమర్చి, బస్సులని నడపాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఉద్యోగులని విధులకు హాజరు కావాలని చెప్పారు. ఇక ఈ విషయంపై కూడా ప్రతిపక్ష టీడీపీ రాజకీయం చేయడం మొదలుపెట్టింది. విధులకు కేవలం పర్మినెంట్ ఉద్యోగులని మాత్రమే రమ్మన్నారని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులని తొలగించేశారని సోషల్ మీడియాలో విష ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
ఏదైనా చిన్న అంశం లో లోపం లేకుండానే టీడీపీ సోషల్ మీడియా దానిని ఎలా చిలువలు పలవలుగా ప్రచారం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్క ర్లేదు. ఇక ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయాన్ని కూడా అంతే ప్రచారం చేయడం మొదలు పెట్టేసింది. అటు పలు మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాయి. దాదాపు ఆరు వేల మందికి పైగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆర్టీసీ షాకిచ్చిందని, ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయని రాశాయి. అలాగే వారికి జీతాలు కూడా అందలేదన్న విషయాన్ని కూడా చెప్పాయి.
అయితే ఔట్సోర్సింగ్ ఉద్యోగులని తొలగించరానే ప్రచారంపై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించలేదని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కరోనా రక్షణ ఇన్సూరెన్స్ లేకపోవడంతో పర్మినెంట్ ఉద్యోగులు ముందుగా హాజరుకావాలని ఆదేశించామని చెబుతూ, టీడీపీ విష ప్రచారానికి చెక్ పెట్టారు. టీడీపీ వాళ్లు పని పాటా లేకపోవడంతోనే ఈ తరహా ప్రచారం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. ఇప్పటకి అయినా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే ఆ పార్టీకి కనీసం గౌరవం అయినా ఉంటుందని హితవు పలికారు.
అలాగే కరోనా కారణంగా ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోయాం..కానీ ఆర్టీసీలో ఎవరినీ తొలగించలేదుని వివరణ ఇచ్చారు. మరి టీడీపీ వాళ్లు ఇప్పటకి అయినా ఈ ప్రచారం ఆపుతారో ? లేదో ? చూడాలి.