కొవిడ్ -19 మహమ్మారిని అరికట్టేందుకు హెర్డ్ ఇమ్యూనిటీ సరిపోకపోవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనిపైనా మరిన్ని అధ్యయనాలు చేయాలని అంటున్నారు. ‘రీ ఇన్ఫెక్షన్లపై మాకు ఇంకా స్పష్టత రాలేదు. ఇది టీకాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కూడా చెప్పడం కష్టం.’ అని బెల్జియం వైరాలజిస్ట్ మార్క్ వాన్ రాన్ట్స్ పేర్కొన్నారు. కొవిడ్ రీ ఇన్ఫెక్షన్ ప్రభావం టీకాపై కచ్చితంగా ఉంటుందని బెల్జియంలోని అకాడెమిక్ హాస్పిటల్ యుజెడ్ లెవెన్లోని క్లినికల్ బయాలజిస్ట్ రాన్ట్స్ తెలిపారు.
కరోనా నుంచి కోలుకున్న ఒక వ్యక్తికి 142 రోజుల తర్వాత రీఇన్ఫెక్షన్ వచ్చినట్లు క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్లో ఒక అధ్యయనం ప్రచురితమైందని తెలిపారు. మొదటిసారి రోగిలోని వైరస్ జన్యువులు, రెండోసారి వైరస్ జన్యువులు వేర్వేరుగా ఉన్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే హెర్డ్ ఇమ్యూనిటీతో కొవిడ్ను ఎదుర్కోవడం కష్టసాధ్యమైన పనిగా అనిపిస్తున్నదని హాంకాంగ్ సైంటిస్టులు చెప్పుతున్నారు. కరోనా రోగులు సహజ ఇమ్యూనిటీ లేదా టీకా ద్వారా రోగనిరోధక శక్తి పెంచుకున్నా వైరస్ అనేది మానవ జనాభాలో తిరుగుతూనే ఉంటుందని తమ అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని అన్నారు..
ఒక వ్యక్తిలో వ్యాక్సిన్ వల్ల టీ కణాలు పెరగవచ్చు.. మరో వ్యక్తిలో పెరగకపోవచ్చన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రతిరోధకాలను (యాంటీబాడీస్) అభివృద్ధి చేయకపోవచ్చు అని వెల్లడించారు. జీవశాస్త్రపరంగా ప్రజలంతా ఒకేలా ఉండవచ్చు, కానీ రోగనిరోధకపరంగా ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారని ఆయన వివరించారు. ఇమ్యూనిటీ పవర్ గురించి విజ్ఞాన శాస్త్రంలో ఇంకా చాలా స్పష్టత లేదన్నారు. కనుక కరోనా రీఇన్ఫెక్షన్ గురించి తెలుసుకోవాలంటే భవిష్యత్తులోనూ లోతైన పరిశోధన జరగాల్సిందేనని స్పష్టం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి