టిఆర్ఎస్ బిజెపి ఎమ్ఐఎమ్ పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలు సవాళ్లు కూడా తెలంగాణ రాజకీయాలను ఊపేశాయి. ఈసారి మేయర్ పీఠం తమ పార్టీకే దక్కుతుంది అని ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా ధీమాతో ఉన్నాయి. ఇక ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజారిటీతో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని టిఆర్ఎస్ కూడా ప్రయత్నాలు చేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నువ్వా నేనా అంటూ జరిగిన ప్రచారానికి ఈ నెల 29వ తేదీన తెర పడగా నేడు జిహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రారంభమైంది.
18 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో మళ్లీ బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరగనుంది. జిహెచ్ఎంసి పరిధిలోని 150 డివిజన్ల పరిధిలో ఉదయం ఏడు గంటలనుంచి పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది ఇక మొత్తం 9101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 150 డివిజన్లను మొత్తం 1122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా ఈ జిహెచ్ఎంసి ఎన్నికల కోసం ఏకంగా 48 వేల సిబ్బంది పాల్గొంటూ ఉండటం గమనార్హం. కాగా ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.