
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆ అధికారిని ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న ఆయన.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ పై రాష్ట్రానికి తీసుకురావాలని భావించారు.. ఏపీకి పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినా అప్పట్లో కేంద్ర హోంశాఖ ఒప్పుకోలేదు. ఆయన ఎవరో కాదు స్టీఫెన్రవీంద్ర. అయితే తాజాగా మరోసారి స్టీఫెన్ రవీంద్రను ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయట. ఈ ప్రతిపాదనను సీఎం జగన్ కేంద్రం ముందుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో కేంద్ర హోమంత్రి అమిత్ షాతో ఈ వ్యహారంపై మాట్లాడినట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అందుకే మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం. కొత్త ఏడాదిలోనైనా ఏపీకి తీసుకురావాలని భావిస్తున్నారట.. అందుకే ప్రయత్నాలు ముమ్మరం చేశారట. సంక్రాంతి టార్గెట్ పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
సీఎం జగన్ ఏడాదిన్నర పాటూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. సంక్రాంతి తర్వాత రచ్చబండ పేరుతో ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. పథకాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోబోతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంలో ఇంటిలిజెన్స్ విభాగం చాలా కీలకం. రాష్ట్రంలో పరిస్థితులు, ప్రభుత్వ తీరుపై ప్రజల్లో స్పందన వంటి అంశాలను ఇంటిలిజెన్స్ డీల్ చేస్తుంది. అందుకే ఆయన్ను ఏపీకి తీసుకొచ్చి ఇంటిలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ ఏడాదిన్నరగా సాగుతోంది. మరి ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి.. ఆయన ఎప్పుడు రాష్ట్రానికి వస్తారన్నది చూడాలి. స్టీఫెన్ రవీంద్ర వ్యవహారంపై ఇటీవల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కూడా ఆసక్తికర ట్వీట్ చేశారు. స్టీఫెన్ రవీంద్ర ఓ మంచి పోలీస్ అధికారి. పోలీస్ వ్యవస్థలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కలిగిన వ్యక్తి. అటువంటి అధికారి, ఇంతటి ప్రశ్నార్థకమైన పరిపాలన, పలు అవినీతి కేసుల్లో ముద్దాయి అయిన ముఖ్యమంత్రి పాలిస్తున్న రాష్ట్రానికి "ఇంటెలిజెన్స్ చీఫ్" గా వస్తారని ఆయన తెలిసిన వ్యక్తిగా తాను అనుకోను అన్నారు. 1990 బ్యాచ్కు చెందిన రవీంద్ర.. సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. 1999లో వరంగల్ జిల్లా పరకాల ఏఎస్పీగా మొదటి పోస్టింగ్.. 2004లో ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. అదే ఏడాది డిసెంబరులో వరంగల్ జిల్లా ఎస్పీగా.. 2010లో హైదరాబాద్లో వెస్ట్ జోన్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఆయనకు ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశారు. రాయలసీమలోనూ బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన తర్వత ఆయన తెలంగాణకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ రేంజ్ ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది తెలంగాణలో సంచలనం రేపిన ఐటీ గ్రిడ్ చోరీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు కూడా స్టీఫెన్ రవీంద్ర ఇంఛార్జ్గా ఉన్నారు.