కరోనా వైరస్ వ్యాపిస్తున్న తొలి దశలో అసలు ఏ వస్తువు ముట్టుకోవాలన్నా భయం భయం. దేన్ని పట్టుకుంటే.. ఎక్కడ వైరస్ మన శరీరంపైకి ఎక్కేస్తుందేమోనన్న అనుమానం. అసలు వైరస్ కి ఆవాసాలుగా ఉండేవి ఏంటి? వైరస్ ని తమపైన ఉంచుకోడానికి ఇష్టపడని పదార్థాలు ఏంటి అనే విషయంపై పెద్ద చర్చే నడిచింది. ముఖ్యంగా కరెన్సీ నోట్లు, పేపర్ల ద్వారా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండేదని బాగా ప్రచారం జరిగింది. బ్యాంకుల్లో నోట్లు ఇవ్వడానికి, తీసుకోడానికి సిబ్బంది బాగా భయపడేవారు. కొన్ని చోట్ల కరెన్సీ నోట్లను ఇస్త్రీ చేసి మరీ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇదంతా తప్పుడు ప్రచారం అంటున్నారు ఏపీ కొవిడ్ నోడల్ ఆఫీసర్ రాంబాబు.

"వైరస్‌ వెలుగులోకి వచ్చిన ఏడాది తర్వాత గతంలో జరిగిన ప్రచారాల్లో ఎక్కువ శాతం అపోహలేనని తేలిపోయింది. ఉదాహరణకు వస్తువులు, కరెన్సీ నోట్లు, పత్రికలు పట్టుకోవడం ద్వారా వైరస్‌ సోకిన దాఖలాలు ఇప్పటి వరకూ లేవు. లాక్‌డౌన్‌ తర్వాత నగదు లావాదేవీలు భారీగా సాగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ కాగితాల వినియోగం సాధారణంగానే ఉంది. ఒకవేళ కాగితాల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశమే ఉంటే.. కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగేది. మాస్కులు ధరించకపోవడం వల్లనే వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉంటోంది." అని అన్నారు రాంబాబు.

అతి సూక్ష్మ రంధ్రాలతో పొరలుపొరలుగా ఉండే వస్తువుల ఉపరితలాలపై వైరస్‌ ఎక్కువ కాలం జీవించదని చెబుతున్నారు ప్రముఖ వైద్యులు ఎంవీ రావు. ఉదాహరణకు కాగితాలు, వార్తా పత్రికలు, అట్టపెట్టెలు, లెటర్లు, టిష్యూ పేపర్లు, ఆహార పొట్లాలు తదితరాల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లుగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ ఒక్క కేసూ నమోదు కాలేదని చెప్పారాయన. ఏ వైద్య పరిశోధనల్లోనూ ఇది నిర్థారణ కాలేదన్నారు.

అంటే ఇంతకాలం పేపర్లతో కరోనా, కరెన్సీ నోట్లతో కరోనా అనే ప్రచారం పూర్తిగా అవాస్తవం అని తేలిపోయింది. ఒకవేళ అలాంటి సందర్భాల్లో కరోనా వచ్చినా.. వాటిని వెంట వెంటనే మార్చుకోవడం వల్ల మాత్రమేనని చెబుతున్నారు నిపుణులు. ఇకపై పేపర్లు, కరెన్సీ నోట్లపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: