ఈ క్రమంలోనే నేరుగా హోం శాఖ మంత్రి అమిత్ షా నుంచి జగన్కు పిలుపు వచ్చింది. దీనిపై ప్రభుత్వ వర్గాల్లో భిన్నమైన కథనాలు వస్తున్నాయి. జిల్లాల విభజనకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్న నేపథ్యంలో దీనిన ప్రభుత్వానికి వివరించేందుకు జగన్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారని సీనియర్ నాయకులు అంటున్నారు. దీనిలో కొంత నిజం ఉంది. త్వరలోనే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. అయితే.. అదే సమయంలో మరో రెండు విషయాలు కూడా ఉన్నాయనే సమాచారం అందుతోంది.
ఒకటి.. ఆలయాలపై దాడులు, బీజేపీ నేతలకు ఎదురవుతున్న అడ్డంకులపై కేంద్రమే జగన్ను పిలిపించిందని చెబుతున్నారు. దీంతో ఏం జరుగుతుంది ? జగన్కు షా.. తలంటుతారా ? అనే చర్చ జోరుగా సాగుతోంది. దీనిపై వైసీపీ నాయకులు ఫోన్లపై ఫోన్లు చేసుకుని మరీ చర్చించుకుంటున్నారు. ఇదిలావుంటే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో మరో సారి వివాదం ఏర్పడడాన్ని కూడా కేంద్రం సీరియస్గానే భావిస్తోంది. ఇప్పటికే ఏడాది కాలంగా వివాదం జరుగుతోంది.
అయితే.. ఇప్పుడు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత కూడా జగన్ సర్కారు సహకరించేది లేదని చెప్పడాన్ని బట్టి.. కేంద్రం దూకుడుగా వెళ్తున్న ఏపీకి బ్రేకులు వేయాలని నిర్ణయించుకున్నట్టుగా టీడీపీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా పరిణామాలపై ఏం జరుగుతుందనే విషయంపై వైసీపీ నేతల మధ్య ఆసక్తికర చర్చ సాగుతుండడం.. కొందరు ఢిల్లీలోని పాత్రికేయులను అలెర్ట్ చేసి మరీ .. ఎప్పటికప్పుడు తమకు సమాచారం ఇవ్వాలని కోరడం ఆసక్తిగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.