ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగియగానే.. మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. దీంతో పార్టీలన్ని ఇప్పుడు పురపోరు పై ఫోకస్ చేశాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులకు అతీతంగా జరుగుతాయి కాబట్టి.. గెలిచిన వారిని తమ అభ్యర్థులుగానే పార్టీలు చెప్పుకున్నాయి. దీనిపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధమే సాగింది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతుండటంతో.. ఏ పార్టీ బలమేంటో తెలియనుంది. దీంతో మున్సిపల్ ఎన్నికలను సవాల్ గా తీసుకున్నాయి పార్టీలు.

మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పచ్చ జెండాను చూసి వైసీపీ నేతలు వణికిపోతున్నారని, సీఎం జగన్ గన్ లో బుల్లెట్లు లేవని కామెంట్ చేశారు.రాష్ట్రం అంతా చూస్తున్నాం.. వైసీపీ నేతలకు పసుపు జెండా చూస్తుంటేనే ఉచ్చపడుతున్నాయి.. జగన్ పిరికోడు కాదా అని అడుగుతున్నాను అని లోకేష్ అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయట కాలు పెట్టడానికే బయపడుతున్నారని విమర్శించారు. ఈయనని చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. ఇది బుల్లెట్ ఉన్న గన్నని చెప్పమనండి. అది ఎక్కడ కాలిందో చెప్పమనండి ” అంటూ నారా లేకేష్.., సీఎం జగన్ పై కామెంట్ చేశారు.

మున్సిపల్ మేనిఫెస్టోలో  10 అంశాలను పొందు పరిచింది టీడీపీ. పల్లెలు గెలిచాయి.. ఇప్పుడిక మనవంతు పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. రూ.5కే పేదలకు కడుపు నిండా భోజనం అందించనున్నట్లు నారా లోకేష్ చెప్పారు. పాత పన్నుల మాఫీ, చెల్లించాల్సిన బకాయిలు పూర్తిగా రద్దు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. శుభ్రమైన ఊరు-శుద్ధమైన నీరు కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత కోసం ఆరు నెలలకోసారి ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు నారా లోకేష్ తెలిపారు. చెత్తలేని నగరాల కోసం సుందరీకరణ మిషన్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. పట్టణ పేదలందరికీ టిడ్కో గృహాల పంపిణీతో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.21 వేలకు పెంచనున్నట్లు నారా లోకేష్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: