ఇక ఇప్పుడు కూడా కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రులకు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచే పెద్ద ఎత్తున ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. గతేడాది స్టీల్ ప్లాంట్ నుంచి తెలుగు రాష్ట్రాలు, ఒడిశాకే ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మిగతా రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతోంది.
కోవిడ్ -19 బాధితుల చికిత్సలో మెడికల్ ఆక్సిజన్ చాలా కీలకంగా మారింది. సాధారణంగా ఆక్సిజన్ను ప్రాణవాయువు అంటాం.. అన్నట్లుగానే ఇప్పుడు అది కరోనా సమయంలో రోగుల ప్రాణాలు కాపాడడానికి చాలా కీలకం అవుతోంది. అయితే, దీని పారిశ్రామిక అవసరాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని, అందుకే భారీ పరిశ్రమల్లో ఆక్సిజన్ తయారీ యూనిట్లు ఉంటాయని ఇండస్ట్రియల్ పొల్యూషన్ టెస్టింగ్ సీనియర్లు చెబుతూ ఉంటారు.
ఇక దేశంలో పలుచోట్ల కొవిడ్ బాధితులకు ప్రాణవాయువు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో... సూరత్లోని న్యూ సివిల్ హాస్పిటల్ తనవంతుగా ఆ లోటును తీరుస్తోంది. ఇక్కడ గాలి నుంచి నిమిషానికి 2 వేల లీటర్ల మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ను తయారు చేస్తున్నారు. అయితే సూరత్లో కొవిడ్ బాధితుల కోసం నిత్యం 250 టన్నుల ఆక్సిజన్ అవసరమవుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇక్కడి సివిల్ ఆసుపత్రిలో ప్రెజర్ స్వింగ్ అడ్సార్ప్సన్ (పీఎస్ఏ) ప్లాంట్ను ఏర్పాటు చేసింది.
అంతేకాక.. విదేశీ సాంకేతికతతో పనిచేసే ఈ ప్లాంటు ద్వారా... సహజ గాలిని కంప్రెస్ చేస్తారు. తద్వారా నైట్రోజన్, కార్బన్-డై-ఆక్సైడ్, ఇతర వాయువులను వేరుచేసి కేవలం ఆక్సిజన్ను మాత్రం తీసుకుంటారు. తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి, పైప్లైన్ ద్వారా కొవిడ్ ఆసుపత్రులకు సరఫరా చేస్తునట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ నిమేశ్ వర్మ చెప్పారు.