ఈ ఈ కామర్స్ సంస్థల్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు బాగా పాపులర్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ రెండు సంస్థలకు కేంద్రం ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. భారత్లో ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దర్యాప్తును వేగవంతం చేయబోతోందట. ఇంతకీ వీటిపై ఆరోపణలు ఏంటంటే.. మార్కెట్లో పోటీతత్వాన్ని అణగదొక్కేందుకు ఎంపిక చేసిన విక్రయదారులను మాత్రమే ఇవి ప్రమోట్ చేశాయట. ఎంపిక చేసుకున్న కొన్ని సంస్థలకు మాత్రమే భారీ డిస్కౌంట్లు ఇచ్చాయట. ఈ మేరకు ఈ సంస్థలపై గతంలోనే ఫిర్యాదులు వచ్చాయి.
అమెజాన్, ఫ్లిప్కార్ట్పై వచ్చిన ఈ ఫిర్యాదులపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గతంలోనే స్పందించింది. 2020 జనవరిలోనే విచారణ ప్రారంభించింది. అయితే ఈ విచారణపై ఈ రెండు సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. దీంతో గత ఏడాది నుంచి విచారణ నిలిచిపోయింది. అయితే.. ఇటీవల కేంద్రం కొత్త ఐటీ చట్టాలను తీసుకువచ్చింది కదా.. ఇప్పుడు ఈ కొత్త చట్టం ఆధారంగా మరోసారి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచారణ ప్రారంభించింది.
కొత్త చట్టం ప్రకారం విచారణకు కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. దీంతో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మళ్లీ ఆ విచారణను వేగవంతం చేయబోతోంది. వీలైనంత త్వరగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి సమాచారాన్ని సేకరించాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా భావిస్తోంది. అంతే కాదు.. ఈ కేసులను ఓ కొలిక్కి తెచ్చేందుకు అదనపు అధికారులను కూడా నియమిస్తారట.