ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు క్రమక్రమంగా వెలువడుతున్నాయి. ఏపీలోని మొత్తం 13 జిల్లాల్లో 13 జిల్లా పరిషత్ లు అధికార వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ఈ క్రమంలోనే టీడీపీ కీలక నేతలకు సైతం పెద్ద షాకులు తగులుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిప ల్లె ఎంపీటీసీనే వైసీపీ బంపర్ మెజార్టీతో గెలుచు కుంది. చివరకు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సొంత నియోజకవర్గం మైలవరంలోనూ ఆయన పరువు పోయింది. గత సాధారణ ఎన్నికల్లో మైలవరంలో ఉమా ఓడిపోయినా కూడా గొల్లపూడి గ్రామంలో ఆయనకు ఏకంగా 3 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే ఈ రోజు కౌంటింగ్లో మొత్తం 10 ఎంపీ టీసీ స్థానాల్లోనూ అక్కడ వైసీపీ తిరుగులేని విజయం సాధించింది.
ఇక రాయలసీమలో అయితే వైసీపీ ఫ్యాన్ జోరు ముందు టీడీపీ పూర్తిగా బేజారు అయిపోయింది. కడప - కర్నూలు - అనంతపురం - చిత్తూరు జిల్లాల్లోని అన్ని స్థానాల్లోనూ వైసీపీ దూసుకు పోయింది. ఇక టీడీపీ సీనియర్లు, కీలక నేతలు ప్రాథినిత్యం వహించిన నియోజకవర్గాల్లో సైతం సైకిల్ పూర్తిగా కుదేలు అయ్యింది. మాజీ మంత్రి, మాజీ విప్ పల్లె రఘునాథ రెడ్డికి పుట్టపర్తి నియోజకవర్గంలో ఘోర పరాభవం ఎదురైంది. అనంతపురం జిల్లా మొత్తం వార్ వన్ సైడ్గా అయి పోయింది. పుట్టపర్తి నియోజకవర్గంలో ఆరు జెడ్పీటీసీ స్థానాలను అధికార వైసీపీ సొంతం చేసుకుంది.
నియోజకవర్గంలోని పుట్టపర్తి - ఆమడగూరు - ఓబులదేవచెరువు ( ఓడీసీ ) - కొత్తచెరువు - నల్లమాడ - బుక్కపట్నం జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. మొత్తం ఆరు జడ్పీటీసీ స్థానాల్లోనూ వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. ఈ విజయంతో ఎమ్మెల్యే శ్రీథర్ రెడ్డి తన సత్తా ఏంటో చాటుకున్నారు. ఈ క్రమంలోనే రాజకీయంగా పల్లె రఘునాథ్ రెడ్డికి ఇది పెద్ద ఎదురు దెబ్బే..! ఈ విజయంతో వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకన్నారు.