గతంలో టోల్ గేట్ల వద్ద టోల్ ఫీజుని క్యాష్ రూపంలో చెల్లించాల్సి వచ్చేది. టోల్ గేట్ దాటే వాహనాలు అటు, ఇటు వెళ్లేటప్పుడు అక్కడ ఆగి డబ్బులిచ్చి, చిల్లర తీసుకుని వెళ్లాల్సి ఉండేది. దీనికి సమయం పట్టేది. ఆ సమయంలో వెనక ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే.. రోడ్డుపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ తర్వాత ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్ట్మ్ తీసుకొచ్చారు. అదే ఫాస్టాగ్. ఫాస్టాగ్ ఉన్న వాహనాల టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన పని లేదు. టోల్ గేట్ దాటగానే ఫాస్టాగ్ లో ఉన్న అమౌంట్ కట్ అయిపోతుంది. ముందుగానే దీన్ని రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. వివిధ రకాల కంపెనీలు, బ్యాంక్ లు ఫాస్టాగ్ సేవలను అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఫాస్టాగ్ కూడా లేకుండా సరికొత్త విధానం అమలులోకి రాబోతోంది.

కేంద్రం తీసుకున్న నూతన నిర్ణయం అమలులోకి వస్తే ఫాస్టాగ్‌ విధానం కూడా త్వరలో కనుమరుగు అవుతుంది. దాని స్థానంలో శాటిలైట్ ఆధారిత టోల్‌ వసూలు వ్యవస్థ అమలులోకి రాబోతోంది. దీనికోసం కేంద్రం కసరత్తులు చేస్తోంది. దీని ద్వారా వాహనదారులకు మేలు చేకూరుతుందనే ఉద్దేశంతో కేంద్రం దీన్ని తెరపైకి తెస్తోంది.

ఐరోపా దేశాల్లో ఇదే పద్ధతి..
ప్రస్తుతం ఐరోపా దేశాల్లో ఫాస్టాగ్ లు లేవు. శాటిలైట్ ఆధారిత గ్లోబల్‌ నేవిగేషన్‌ శాటిలైట్‌ సిస్టం అక్కడ అందుబాటులో ఉంది. ఈ వ్యవస్థ ద్వారా అక్కడ వాహనాలకు టోల్ పన్ను చెల్లిస్తుంటారు. ప్రస్తుతం హైవే ఎక్కగానే ఎక్కడ టోల్ గేట్ దాటినా అక్కడ పన్ను చెల్లించాల్సిందే. అందే టోల్ గేట్ ముందు ప్రయాణం ప్రారంభించి, టోల్ గేట్ దాటిన తర్వాత ఆ ప్రయాణం ముగించినా కచ్చితంగా పన్ను చెల్లించాల్సిందే. అంటే ఒక కిలోమీటర్ దూరం ప్రయాణించినా టోల్ బాదుడు తప్పించుకోలేమనమాట. శాటిలైట్ ఆధారిత నేవిగేషన్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే టోల్ పన్ను విషయంలో వెసులుబాటు ఉంటుంది. టోల్ రోడ్ పై ఎన్ని కిలోమీటర్లు వాహనం ప్రయాణం చేస్తే అన్ని కిలోమీటర్ల దూరానికే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల వినియోగదారులపై అదనపు భారం పడదు. తక్కువ దూరాలకు కూడా టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం దీనిపై అధ్యయనం జరుగుతోంది. త్వరలో ఈ పద్ధతి భారత్ లో అమలులోకి రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: