రాజకీయాల్లో తండ్రీ కొడుకులు ఒకేసారి కీలక పాత్రలు పోషించటం అన్నిటికన్నా రేర్. కానీ ఆ విశేష ఘట్టం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రత్యక్షమైంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా నారా లోకేష్ కొనసాగుతున్నారు. అంతేకాదు, పార్టీ పరంగా చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడైతే, లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి. అంటే... రాజకీయాల్లోనూ, ప్రభుత్వంలోనూ ఇద్దరూ ఫుల్ బిజీ. అయినా వీరిద్దరి మధ్య ఎలా మాటలు జరుగుతాయా ? ఇంట్లో రాజకీయాలేనా ? అనే ఉత్కంఠకు ఎట్టకేలకు సమాధానం వచ్చింది. తాజాగా ఓ జాతీయ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ ఎంతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తండ్రి చంద్రబాబుతో రాజకీయ చర్చలు ‘ఇంట్లో’ మాత్రం అస్సలు ఉండవని స్పష్టం చేశారు. “ఇంటి ముంగిటికి చేరిన తర్వాత రాజకీయాలకి ఎంట్రీ లేదు.


ఇక అదే మేము పాటిస్తున్న ఒక నిబంధన” అని అన్నారు. అలాగే చంద్రబాబు కూడా ఇంట్లో రాజకీయాల ప్రస్తావనకు అవకాశం ఇవ్వరని చెప్పారు. వాస్తవానికి బయట ఇద్దరూ కీలక పదవుల్లో ఉన్నా... ఇంట్లో మాత్రం తండ్రీ కొడుకుల బంధంతో ఎంతో ప్రేమ‌గా ఉంటారు . “ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన నా బాస్ కాదు, నా తండ్రి. అందుకే నాన్న అని పిలుస్తాను. తండ్రిగా, కుటుంబ సభ్యుడిగా ఆయనతో ఇతర విషయాలపై మాట్లాడుతాను. రాజకీయాలు ఇంట్లోకి రానివ్వం. అలాగే ఇంటి విషయాలను బయట ప్రస్తావించం. ఇదే మా జీవన శైలి” అని లోకేష్ చెప్పుకోచ్చారు. ఒక కొడుకుగా, ఒక నాయకుడిగా తన పాత్రల గురించి లోకేష్ ఎంతో ఓపికగా, నిశ్శబ్దంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నాడని తెలుస్తోంది. “రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకునే ముందు, మా కుటుంబ వ్యాపారాలను అయిదేళ్ల పాటు చూసాను. తర్వాతే రాజకీయలోకి వ‌చ్చాను” అని వివరించారు.


ఇక తన జీవితంలో అత్యంత బాధ్యతాయుతమైన, గుండెను కలిచిన ఘట్టం గురించి చెబుతూ... “నా తండ్రిని అరెస్ట్ చేసి జైలులో పెట్టిన రోజు నాకు తట్టుకోవడం చాలా కష్టమైంది. ఆయన రాజమండ్రి జైలులో ఉండగా నేను ఏడ్చేశాను. నా గుండె తరుక్కుపోయింది” అన్నారు లోకేష్ . ఇంతవరకూ తండ్రి గురించి చెబుతూ భావోద్వేగానికి లోనైన లోకేష్, తల్లి భువనేశ్వరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. “నా  జీవితంలో తల్లి పాత్ర ఎంతో అమోఘం. ఆమె నన్ను ఎంతో శ్రద్ధగా, ప్రేమగా పెంచింది. చదువు, అభివృద్ధి, కెరీర్ ఇలా ప్రతిదానిలో అమ్మ మార్గదర్శకత్వం కీలకం. నేను ఈ స్థాయికి రావ‌డానికి అమ్మ చేసిన త్యాగాలే కారణం” అని తెలిపారు. మొత్తానికి, లోకేష్ చెప్పిన ఈ వ్యక్తిగత విశేషాలు... రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా, కుటుంబ బంధాలను ఎంత సమత‌రంగా నిర్వహిస్తున్నారో స్పష్టంగా చూపిస్తున్నాయి. తండ్రీ కొడుకులిద్దరూ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ, ఇంట్లో మాత్రం ఆ బంధాన్ని  కాపాడుకుంటూ, వ్యక్తిగత విలువలతో జీవించటం నిజంగా స్పూర్తిదాయకం!

మరింత సమాచారం తెలుసుకోండి: