
రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నూతనంగా తీసుకువస్తున్న సంస్కరణలలో భాగంగా, ఇకపై 50 చదరపు గజాల విస్తీర్ణంలో జీ+1 (గ్రౌండ్ ప్లస్ వన్) లేదా అంతకంటే తక్కువ భవన నిర్మాణాలకు కేవలం ఒక్క రూపాయికే అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నిర్ణయం అమలులోకి వస్తే, రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు నేరుగా లబ్ధి పొందనున్నారు. ముఖ్యంగా తమ కష్టార్జితంతో చిన్న ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి ఈ నిర్ణయం గొప్ప ఊరటనిస్తుంది. ఇంతకు ముందు అనుమతుల కోసం అయ్యే ఖర్చుల భారం తగ్గడం వల్ల, మొత్తంగా ప్రజలపై దాదాపు 6 కోట్ల రూపాయల మేర భారం తగ్గనుంది అని అంచనా.
నిర్మాణ అనుమతులను పొందడం కూడా ప్రభుత్వం సులభతరం చేసింది. లబ్ధిదారులు ఆన్లైన్ ద్వారా ఇంటి ప్లాన్, దరఖాస్తును అప్లోడ్ చేసి, కేవలం ఒక రూపాయి చెల్లించడం ద్వారా సులభంగా అనుమతులు పొందవచ్చు. ఈ విధానం వల్ల పేద ప్రజలకు నిర్మాణ అనుమతులు వేగంగా, పారదర్శకంగా లభిస్తాయి. కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారికి మేలు జరిగేలా సీఎం చంద్రబాబు తీసుకుంటున్న ఈ కొత్త నిర్ణయాలు రాష్ట్రంలో సామాన్యుల సొంతింటి కల నెరవేర్చడంలో కీలకంగా మారనున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రజలకు మేలు చేకూరేలా మరిన్ని నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం అందుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణ రంగం శరవేగంగా పుంజుకునేలా ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇళ్ళు నిర్మించుకునే వాళ్లకు మరింత అండగా నిలబడితే వాళ్లకు మరింత బెనిఫిట్ కచ్చితంగా కలుగుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.